ఇండియన్ ఆర్మీ పోరాట శక్తిని చూపించిన కొన్ని బెస్ట్ సినిమాల గురించి తెలుసుకోండి. దేశభక్తి, త్యాగం, ప్రేమతో నిండిన కథలు ఇవే.

ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన కౌంటర్ అటాక్ మరోసారి ఇండియన్ ఆర్మీ శక్తిని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో దేశం కోసం ప్రాణాలకైనా తెగించే సైనికుల త్యాగాలు, వారు చూపే ధైర్యాన్ని ప్రతిబింబించే సినిమాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి.

భారత సైన్యం గొప్పతనాన్ని తెరపై చూపించిన కొన్ని సినిమాలు దేశభక్తిని నింపేలా, గూస్‌బంప్స్ వచ్చేలా ఉంటాయి. వీటిలో శేర్షా కీలకంగా చెప్పుకోవచ్చు. కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితంపై ఆధారంగా తీసిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా పోషించిన పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. దేశం కోసం తన ప్రేమను త్యాగం చేసిన కథ మనసుల్ని కదిలిస్తుంది.

అలాగే 26/11 ముంబై దాడుల్లో వీరంగా మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాలో అడివి శేష్ తన నటనతో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశాడు.

మరోవైపు కార్గిల్ యుద్ధ సమయంలో మొదటిసారిగా వార్ జోన్‌లో అడుగుపెట్టిన భారతీయ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తీసిన సినిమా ది కార్గిల్ గర్ల్ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జాన్వీ కపూర్ తన పాత్రకు న్యాయం చేశారు.

భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా కథను తెరపై అందించిన బయోపిక్‌ కూడా విశేషంగా నిలిచింది. విక్కీ కౌశల్ పోషించిన పాత్రలో ఆయన యూనిక్ పర్సనాలిటీ, నాయకత్వ లక్షణాలు హైలెట్ అయ్యాయి.

సబ్‌మెరైన్ యుద్ధ కథతో తెరకెక్కిన మరో సినిమాగా ది ఘాజీ అటాక్ నిలిచింది. కే కే మీనన్, రానా దగ్గుబాటి నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఉత్కంఠ పుట్టిస్తుంది.

ఉరి దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌ను ఆధారంగా తీసిన ఉరి సినిమాలో విక్కీ కౌశల్ నటనతో పాటు “హౌస్ ద జోష్” డైలాగ్ దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమా నాలుగు నేషనల్ అవార్డులు గెలుచుకోవడం, రూ.359 కోట్లు వసూలు చేయడం విశేషం.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా రూపొందిన మరో సినిమా సీతారామం. ప్రేమకథతో పాటు సైనికుడి జీవితం ఇందులో హృదయాన్ని హత్తుకునేలా చూపించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు స్పెషల్ ఆకర్షణగా నిలిచింది.

ఇలా భారత సైనికుల త్యాగం, దేశభక్తిని హైలెట్ చేసిన ఈ సినిమాలు కేవలం వినోదాన్ని అందించక, గర్వంగా భావించేలా చేస్తాయి. ప్రతి భారతీయుడు కనీసం ఒక్కసారి వీటిని చూడాల్సిందే.