తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం హైదరాబాద్ రాజ్ భవన్ చోరీ జరిగింది. ఇంతకూ ఈ చోరి చేసిందెవరు? ఏం దొంగిలించారో తెలుసా?

Hyderabad : నిత్యం కట్టుదిట్టమైన భద్రతలో ఉండే రాజ్ భవన్ లోనే చేతివాటం చూపించాడో కేటుగాడు. హైదరాబాద్ నడిబొడ్డున గల తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ లో చోరీ జరిగింది. రాజ్ భవన్ ప్రాంగణంలోని సుదర్శన భవన్ లో కొన్ని కంప్యూటర్ల నుండి హార్డ్ డిస్కులు మాయమయ్యాయి... ఈ చోరీ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మే 13నే తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ జరిగింది... కానీ ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం నాలుగు హార్డ్ డిస్క్ లు చోరీకి గురయినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయితే నిత్యం భద్రతావలయంలో ఉండే రాజ్ భవన్ లో బయటి వ్యక్తులు చొరబడి చోరీ చేయడం అసాధ్యం. కాబట్టి ఈ పని అక్కడ పనిచేసే సిబ్బందే చేసారని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ సిసి కెమెరా రికార్డ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలోనే వారి ప్రాథమిక విచారణలో రాజ్ భవన్ లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో  కంప్యూటర్ హార్డ్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే శ్రీనివాస్ ఈ పని చేసినట్లుగా తేలింది. ఇప్పటికే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది.

అయితే ఇంత రిస్క్ చేసి రాజ్ భవన్ లో చోరి చేసాడంటే ఆ హార్డ్ డిస్కుల్లో కీలక సమాచారమేదో ఉండివుంటుంది. అందుకే పోలీసులు ఈ హార్డ్ డిస్క్ ల దొంగతనం వెనక ఇంకెవరి హస్తమైన ఉందా అన్నకోణంలో విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ నుండి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లను రాజ్ భవన్ అధికారులకు అప్పగించారు పోలీసులు.