Gautam Gambhir on Shreyas Iyer: ఇంగ్లాండ్ టెస్ట్లకు శ్రేయస్ అయ్యర్ను బీసీసీఐ భారత జట్టు నుంచి తప్పించింది. దీనిపై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశ్నించగా.. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Gautam Gambhir on Shreyas Iyer: ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. శ్రేయస్ అయ్యర్ను ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు భారత జట్టులో ఎంపిక చేయకపోవడంపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. “నేను సెలెక్టర్ను కాను” అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు గంభీర్ సమాధానం ఇచ్చారు. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శ్రేయస్ ను జట్టు నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంచి ఫామ్ లో ఉన్న అయ్యర్ ఎందుకు ఎంపిక చేయలేదని మాజీ ప్లేయర్లు కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
2024 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత శ్రేయస్ టెస్టు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన వివిధ టోర్నీలు, డొమెస్టిక్ మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. 2024-25 రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున ఏడు ఇన్నింగ్స్లలో 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రేయస్ నిలిచాడు. 5 మ్యాచుల్లో 243 పరుగులు చేశాడు. అలాగే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 టోర్నీలో పంజాబ్ కింగ్స్కు కెప్టెన్ గా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్ 14 మ్యాచ్లలో 171.90 స్ట్రైక్ రేట్, 51.40 సగటుతో 514 పరుగులు చేశాడు. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ను టైటిల్ వరకూ నడిపించిన కెప్టెన్గా అతని నాయకత్వ నైపుణ్యం గుర్తింపు పొందింది.
ఇటీవల భారత టెస్టు జట్టు ఎంపిక ప్రకటన సందర్భంగా ప్రధాన సెలెక్టర్ అజిత్ అగర్కర్ మాట్లాడుతూ.. “అవును, శ్రేయస్ అయ్యర్ ఒక మంచి వన్డే సిరీస్ ఆడాడు. డొమెస్టిక్ క్రికెట్లో బాగా రాణించాడు. కానీ ప్రస్తుతానికి టెస్ట్ జట్టులో అతనికి చోటు లేదు” అని చెప్పారు.
ఇక ఈ టెస్ట్ సిరీస్కు భారత జట్టులో చోటుదక్కించుకోలేకపోయిన మరో స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ. ఐదు టెస్టుల సిరీస్లో ఆడేందుకు అతని ఫిట్నెస్ సరిపోదని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడింది. మరోవైపు, ఏడు సంవత్సరాల తర్వాత టెస్ట్ జట్టులోకి మళ్లీ చోటు దక్కించుకున్నాడు కరుణ్ నాయర్. టాప్ ఆర్డర్ను బలపరిచేందుకు బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ను జట్టులోకి తీసుకున్నారు.