ఐపిఎల్ 2025 ఫైనల్స్కి చేరాక ఆర్సిబి ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని అంటింది. కప్పు మనదే అంటూ సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ ఇప్పుడో కొత్త డిమాండ్స్ ప్రారంభించారు. అవేంటో తెలుసా?
Royal Challengers Bengaluru : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ కు చేరిన ఈ జట్టు కలల కప్ కు అడుగుదూరంలో నిలిచింది… కేవలం ఇంకో మ్యాచ్ గెలిస్తే చాలు ఆ టీం నిరీక్షణకు తెరపడుతుంది. ‘ఈ సాల కప్ నమ్దే’ అని ఆర్సిబి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు.
లీగ్ దశను దాటుకుని ప్లేఆఫ్ కు చేరుకున్న ఆర్సిబి నిన్న(గురువారం) మొదటి క్వాలిఫయర్ లో మరింత చెలరేగి ఆడింది. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ కు అర్హత సాధించింది. ఇలా ఐపిఎల్ 2025 లో ఫైనల్ కు చేరిన మొదటి జట్టు ఆర్సిబి… 9 ఏళ్ళ తర్వాత ఐపిఎల్ ఫైనల్ ఆడనుండటంతో అభిమానుల ఆనంధానికి అవధులు లేవు.
ఆర్సిబి ఆటతీరు చూస్తుంటే ఏమాత్రం డౌట్ లేదు… కప్ తమదే అనే ధీమాతో ఉన్నారు అభిమానులు. ఈ క్రమంలో తమ ఆనందాన్ని వివిధ రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈసారి ఐపిఎల్ కప్ మాత్రమే కాదు దేశ రాజధాని కూడా బెంగళూరుకు వస్తుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు.
ఈసారి ఐపిఎల్ ట్రోపీ గెలిచాక బెంగళూరును దేశ రాజధానిగా ప్రకటించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ కాలుష్యంతో నిండిపోయిందని… కాబట్టి రాజధానిని బెంగళూరుకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా దేశ రాజధానిగా డిల్లీ కంటే బెంగళూరు మెరుగ్గా ఉంటుందని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
డిల్లీలో మాదిరిగా బెంగళూరులో కాలుష్యం ఉండదు…మంచి వాతావరణం ఉంటుందంటున్నారు. అలాగే నగరం ఐటీ హబ్, స్టార్టప్లకు కేంద్రం… తక్కువ కాలుష్యం ఉండటంతో ఇక్కడ జీవించేవారికి మంచి వాతావరణం లభిస్తుంది. ఇక విదేశీ కంపెనీలకు ఇష్టమైన నగరం బెంగళూరు. ఇలా అన్ని విధాలా దేశ రాజధానిగా ఉండేందుకు బెంగళూరు అర్హత కలిగి ఉందని అంటున్నారు.
ఈసారి ఆర్సిబి ఐపిఎల్ కప్పు కూడా గెలుస్తుంది కాబట్టి బెంగళూరుని రాజధాని చేయాలని కొందరు నెటిజన్లు సరదాగా డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ డిమాండ్ వైరల్ అవుతోంది. ఆర్సిబి ఫ్యాన్స్తో పాటు చాలా మంది దీనికి మద్దతు తెలుపుతున్నారు.
ఇదిలావుంటే ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడే జూన్ 3న ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించాలని ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాసాడు. తమ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సిబి ఐపిఎల్ లో చరిత్ర సృష్టించనుంది.. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పించాలని తన లేఖ ద్వారా బెళగావి జిల్లాకు చెందిన శివానంద మల్లన్నవర్ సీఎంను కోరాడు.
‘’ఎన్నో ఏళ్ళుగా ఆర్సిబి ఐపిఎల్ ట్రోఫీ గెలుస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు… ఈ సాల కప్ నమ్దే (ఈసారి కప్ మనదే) అని జపిస్తూ కలలు కన్నారు… ఇన్నాళ్లకు ఆ కల నెరవేరబోతోంది. ఆర్సిబి విజయం తర్వాత ఫ్యాన్స్ సంతోషం మామూలుగా ఉండదు, ప్రతి ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. అందుకే ఐపిఎల్ ఫైనల్ జరిగే జూన్ 3న సెలవు ఇవ్వాలి. ఈ విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది ఇదే జూన్ 3న ప్రభుత్వం అధికారిక సెలవు ఇవ్వాలి'' అని శివానంద కోరారు.
ఇక క్వాలిఫయర్ 1లో భాగంగా మొహాలీలో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. RCB కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్ లో మార్కస్ స్టోయినిస్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సిబిలో సాల్ట్ 56 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆర్సిబి బౌలర్లలో సుయశ్ శర్మ (3/17), జోష్ హాజిల్వుడ్ (3/21), యశ్ దయాళ్ (2/26), భువనేశ్వర్ కుమార్ (1/17) రాణించారు.