RCB : ఈ సాల కప్ నమ్దే.. ఒక్క విజయంతో ఈ మాట నిజమౌతుంది, కల నెరవేరుతుంది
ఎప్పటిలా కాదు… ఈసారి ‘ఈ సాలా కమ్ నమ్దే’ అని సగర్వంగా చెప్పుకోడానికి ఆర్సిబి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. కలల కప్ కి ఆర్సిబి అడుగుదూరంలో నిలిచింది… ఒక్క మ్యాచ్ గెలిచిందా.. కోహ్లీ ఫ్యాన్స్ కు పండగే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆర్సిబికి అడుగు దూరంలో ఐపిఎల్ కప్
Royal Challengers Bengaluru : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిందంటే చాలు ఓ పదం బాగా వినిపిస్తుంది... అదే 'ఈ సాలా కప్ నమ్దే'. అంటే కన్నడలో ఈసారి కప్ తమదేనని.. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల నినాదంగా మారింది. కానీ ప్రతిసారి కప్ తమదే అనుకోవడం తప్ప ఫలితం లేకుండా పోయింది.
అయితే ఈసారి అభిమానుల కల నెరవేరేలా ఉంది. ఆర్సిబి ఐపిఎల్ ట్రోపీని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. మొదటి ప్లేఆఫ్ లో అద్భుత విజయాన్ని అందుకున్న ఆర్సిబి ఫైనల్లోకి రాయల్ ఎంట్రీ ఇచ్చింది... ఇదే ఊపుతో మరో మ్యాచ్ గెలిస్తే చాలు... ఆర్సిబి అభిమానుల కల నెరవేరుతుంది.
పంజాబ్ పై ఆర్సిబిదే విజయం
ఈ ఐపిఎల్ సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది ఆర్సిబి. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లోనూ రాణిస్తున్నారు ఆటగాళ్లు. ఇలా లీగ్ స్టేజ్ లో సూపర్ గా ఆడిన ఆర్సిబి ప్లేఆఫ్ కు చేరింది. గురువారం అత్యధిక విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ లో నిలిచిన రెండుజట్లు మొదటి క్వాలిఫయర్ 1 తలపడ్డాయి. ఇలా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో విజయం ఆర్సిబినే వరించింది.
సాల్ట్ సాలీడ్ ఇన్నింగ్స్
రెండు బలమైన జట్ల మధ్య క్వాలిఫయర్ 1 రసవత్తరంగా సాగుతుందని అభిమానులు భావించారు. కానీ అలా జరగలేదు... పంజాబ్ పై ఆర్సిబి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బెంగళూరు బౌలర్ల దాటికి పంజాబ్ టీం విలవిల్లాడిపోయింది. అతికష్టంగా వంద పరుగులు చేయగలిగింది. 14.1 ఓవర్లలో కేవలం 101 పరుగులు మాత్రమే చేసింది.. బలమైన పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.
ఇక పంజాబ్ విసిరిన 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సిబి ఉఫ్ అనిపించింది. కేవలం 10 ఓవర్లలోనే పని కానిచ్చేసారు... ఓపెనర్ సాల్ట్ 56 పరుగులతో చివరివరకు నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. పంజాబ్ బ్యాటర్లు తడబడ్డ అదే పిచ్ పై ఆర్సిబి ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు... 27 బంతుల్లోనే 56 పరుగులు చేసా సాల్ట్. అతడికి కోహ్లీ (12 పరుగులు), మయాంక్ అగర్వార్ (19 పరుగులు), కెప్టెన్ పాటిదార్ (15 నాటౌట్) తోచిన సహకారం అందించారు.
సుయశ్ శర్మ సూపర్ బౌలింగ్
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ను కేవలం 101 పరుగులకే కట్టడిచేసి విజయాన్ని ఖరారుచేసారు ఆర్సిబి బౌలర్లు. యువ ఆటగాళ్లు సుయశ్ శర్మ, యశ్ దయాళ్ తో పాటు సీనియర్ బౌలర్ హేజిల్ వుడ్ తలో మూడు వికెట్లు తీసుకుని పంజాబ్ పతనాన్ని శాసించారు. వీరిదాటికి పంజాబ్ బ్యాటర్లు వచ్చినవారు వచ్చినట్లే పెవిలియన్ కు చేరారు. కేవలం 14 ఓవర్లకే టీం మొత్తాన్ని ఆలౌట్ చేసి సగం విజయాన్ని ఇక్కడే పూర్తిచేసారు ఆర్సిబి బౌలర్లు.
కోహ్లీ ఫ్యాన్స్ కు పండగే...
ఇలా ఐపిఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ టీం తమ ఫామ్ ను కంటిన్యూ చేసింది. ఇదే ఇంకో మ్యాచ్ లో కొనసాగిస్తే ఆ జట్టు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. కేవలం ఆర్సిబి అభిమానులే కాదు చాలామంది ఇతర జట్ల అభిమానులు కూడా ఈసారి ఆర్సిబి కోహ్లీ టీం నిలవాలని కోరుకుంటున్నారు. ఇక ఆర్సిబి టీం, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కొందరు దేవుళ్లను ప్రార్థిస్తూ పూజలు కూడా చేస్తున్నారు. ఆర్సిబి ఆటగాళ్లు కూడా ఈసారి ఎలాగైన ఐపిఎల్ ట్రోఫీతో సంబరాలు జరుపుకోవాలని భావిస్తోంది... అభిమానులతో పాటు సంబరాలకు సిద్దంగా ఉన్నామని కెప్టెన్ పాటిదార్ పంజాబ్ తో మ్యాచ్ అనంతరం తెలిపారు.
సహజంగా భారత్ లో క్రికెట్ ను అభిమానించేవారు తప్పకుండా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీలలో ఎవరో ఒకరిని అభిమానిస్తారు. అయితే వీరిలో రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్, ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ పలుమార్లు ఐపిఎల్ విజేతగా నిలిచింది. కానీ కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సిబి ఒక్క ట్రోపీ కూడా గెలవలేదు. కనీసం అతడు ఆటగాడిగా కొనసాగుతున్న జట్టు విజేతగా నిలిచినా చూద్దామని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇన్నాళ్లకు వారి కల నెలవేరే సమయం వచ్చింది. మరి జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ ఐపిఎల్ విజేతను నిర్ణయించనుంది.