ఇండియా-పాకిస్తాన్ సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ  ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ల రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ శుక్రవారం ప్రకటించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నిర్ణయం ధర్మశాలలో గురువారం సాయంత్రం జరిగిన సంఘటనల తర్వాత తీసుకుంది. పంజాబ్ కింగ్స్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను, పాకిస్తాన్ డ్రోన్ దాడుల తర్వాత విద్యుత్ అంతరాయం వల్ల మధ్యలోనే నిలిపివేశారు. ఆ తర్వాత ఆటగాళ్లు, ప్రేక్షకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.బీసీసీఐ చైర్మన్ అరుణ్ ధూమల్ మాట్లాడుతూ, “ప్రస్తుతం దేశంలో నెలకొన్న అప్రమత్తత పరిస్థితుల మధ్య ఆటను కొనసాగించడం సబబు కాదు. భద్రతా సంస్థలతో సంప్రదించి, సమగ్రంగా సమీక్షించిన తర్వాత రద్దు చేయాలని నిర్ణయించాం,” అని తెలిపారు.

రద్దైన మ్యాచ్‌లలో ప్రధానంగా లక్నో, ఢిల్లీ, అమృత్‌సర్, జైసల్మేర్, పటియాలా వేదికలలో జరిగే ఆటలు ఉన్నాయి. వీటి కోసం విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే దేశానికి చేరుకున్న నేపథ్యంలో, వీరి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భవిష్యత్తులో టోర్నీ మళ్లీ కొనసాగించాలన్న యోచనపై బీసీసీఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం IPL 2025 సీజన్ మొత్తం రద్దు అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు తుది నిర్ణయం కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖలతో చర్చించిన అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.ఇప్పటి వరకు ఈ సీజన్ లో 58 గేమ్ లు జరగగా..ఇంకా 16 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. గ్రూప్ స్టేజ్ లో 12, ప్లే ఆఫ్ లో 4 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.

ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు తమ దేశాలకు వెళ్లిపోయే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. శుక్రవారం లక్నోలో జరగాల్సిన మ్యాచ్ కూడా అధికారికంగా రద్దు అయింది. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత దురదృష్టకర పరిస్థితిగా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

బీసీసీఐ తాజా ప్రకటన దేశవ్యాప్తంగా అభిమానుల్ని నిరాశకు గురి చేస్తోంది. అయితే, దేశ భద్రతకే మొదట ప్రాధాన్యత అనే వాదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.