కరోనా కష్ట కాలం అయినా.. ఆ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచాయి..
ఇది కరోనా కాలం. లాక్ డౌన్ వల్ల వివిధ రంగాల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా, ఉత్పత్తి లేక.. నిల్వ ఉత్పత్తులు అమ్ముడుపోక సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో కంపెనీలు పలువురు ఉద్యోగులను ఇళ్లకు సాగనంపుతుంటే కొన్ని కంపెనీలు మాత్రం తమ సిబ్బంది వేతనాలు పెంచేశాయి.
న్యూఢిల్లీ: ఉద్యోగాల కోత, జీతాల తగ్గింపు, ఇంక్రిమెంట్లు వాయిదా వంటి వాటితో హడలెత్తి పోతున్న ప్రస్తుత కరోనా లాక్డౌన్ వేళ.. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు శుభవార్తనందించాయి. హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, జాన్సన్ అండ్ జాన్సన్, హెచ్సీసీబీ, ఫ్లిప్కార్ట్, మింత్రా, సీఎస్ఎస్ కార్ప్, భారత్పే, బీఎస్హెచ్ హోమ్ అప్లియెన్సస్, ఇన్ఫ్లెక్సన్ పాయింట్ వెంచర్స్ లాంటి కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాల పెంపును చేపట్టాయి.
ఈ కరోనా కష్టకాలంలో కూడా ఈ కంపెనీలు ఉద్యోగులను ప్రమోట్ చేస్తూ.. వారికి ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీలు వారి బిజినెస్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
‘ఈ సంక్షోభ సమయంలో, ఉద్యోగులపై కంపెనీలకు ఉన్న ప్రేమ, సానుభూతిని చూపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతాం. జీతాల అనేది ఈ కష్టకాలంలో ఉద్యోగులకు ఎంతో ఉపయోగ పడుతుందని మేము నమ్ముతున్నాం’ అని సీఎస్ఎస్ కార్ప్ సీఈవో మనీష్ ఠాండన్ అన్నారు.
ఈ ఐటీ సర్వీసెస్ కంపెనీ తన 7000 మంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను, వేరియబుల్ చెల్లించింది. మొత్తం వర్క్ ఫోర్స్లో 70 శాతంగా ఉన్న దిగువ స్థాయి ఉద్యోగులకు, 100 శాతం పేరియబుల్ చెల్లింపులు జరిపింది.
కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు ధైర్యాన్ని పెంచడం తమ బాధ్యతని, వారికి సెక్యూరిటీ ఇవ్వాలని బీఎస్హెచ్ హోమ్ అప్లియెన్సస్ ఎండీ, సీఈవో నీరజ్ బాహ్ల్ అన్నారు. మార్కెటింగ్, ట్రావెల్ కాస్ట్కు కోత పెట్టిన ఈ కంపెనీ, హైరింగ్ను ఫ్రీజ్ చేసింది. ఈ ఖర్చులను తగ్గించుకుని, తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను, ప్రమోషన్లను ఇచ్చింది.
also read కరోనా విజృంభణ: చైనాను దాటేసిన భారత్ మరణాలు
‘మేము శాలరీ తగ్గింపు లేదా ఉద్యోగాల కోత వంటి ఏ నిర్ణయం తీసుకోలేదు. మేము పీపుల్ ఫస్ట్ ఆర్గనైజేషన్. ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తే.. ఆర్గనైజేషన్ను వారు ముందుండి నడిపిస్తారు’ అని ఇన్ఫ్లెక్సన్ పాయింట్ వెంచర్స్ సీఈవో వినయ్ బన్సాల్ అన్నారు.
కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు మాత్రం ఈ కరోనా లాక్డౌన్ సమయంలో వేతన కోతలను, లేఆఫ్స్ను చేపట్టాయి. చాలా మంది ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు, రెమ్యునరేషన్ పెంచుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
ఇక ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, విప్రో, పీడబ్ల్యూసీ ఇండియా, ఇన్ఫోసిస్ కంపెనీలు వేతన పెంపును వాయిదా వేశాయి. ఓయో రూమ్స్, టీవీఎస్ మోటార్స్లు జీతాలు తగ్గించాయి. ఓలా, ఉబర్, జొమాటో, ఐబీఎంలు ఉద్యోగులపై వేటు వేశాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులకు ధైర్యం ఇచ్చేందుకు వేతన పెంపును చేపట్టాయి
కన్జూమర్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ఇండస్ట్రీలు కరోనా సంక్షోభానికి ఎక్కువగా ప్రభావితం కాలేదని, దీంతో వారి దగ్గరున్న క్యాష్ ఫ్లోలతో వేతన పెంపులను, బోనస్లను ఇచ్చాయని డెలాయింట్ ఇండియా పార్టనర్ ఆనంద్రూప్ ఘోష్ అన్నారు. ఏప్రిల్–మార్చి సైకిల్ను ఫాలో అవుతోన్న హెచ్యూఎల్, గతేడాది వేరియబుల్ పేని చెల్లించింది. ప్రస్తుత ఏడాది ఇంక్రిమెంట్లను ఉద్యోగులకు చెల్లించినట్టు హెచ్యూఎల్ అధికార ప్రతినిధి చెప్పారు.
భారత్పే కూడా యాన్యువల్ అప్రైజల్ ప్రకారం, ఎక్కువగా పర్ఫార్మ్ చేసిన ఉద్యోగులకు 20 శాతం, ఆపైన ఇంక్రిమెంట్లను ఇచ్చింది. మింత్రా కూడా ఉద్యోగుల ఎవాల్యుయేషన్ ప్రాసెస్ను పూర్తి చేసింది. ఈ ఏడాది 280 మందికి పైగా ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. కోకా కోలా బాటిల్లింగ్ పార్టనర్ హెచ్సీసీబీ 7–8 శాతం ఇంక్రిమెంట్లను ప్రకటించింది. కరోనా టైమ్లో ఎలాంటి లేఆఫ్స్ను, వేతన తగ్గింపును చేపట్టలేదని పేర్కొంది. ఏషియన్ పేయింట్స్ కూడా కరోనా వ్యాపారాలపై ప్రభావం చూపినా వేతనాలను పెంచింది.