రాబోయే భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వెహికిల్స్ దే అని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లు బైకులు స్కూటర్లు అలాగే ఇన్వర్టర్లు ఇలా ఏది తయారు చేయాలన్నా ఎలక్ట్రిక్ బ్యాటరీలనేవి చాలా ముఖ్యం. ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీకి లిథియం లోహం చాలా అవసరం అవుతుంది. ప్రస్తుతం చైనా ఈ లిథియం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అయితే తాజాగా భారత్ లిథియం ఉత్పత్తిలో కొత్త చరిత్రను లెక్కించేందుకు సిద్ధమవుతోంది.
మన దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని దేగన్ (నాగౌర్)లో కొత్త లిథియం నిక్షేపాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో లిథియం నిల్వల విషయంలో భారత్ గొప్ప విజయాన్ని సాధించింది. లిథియం నిల్వలు మొత్తం భారతదేశం డిమాండ్లో 80 శాతాన్ని తీర్చగలదని GSI, మైనింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిల్వల ఆవిష్కరణ అనంతరం లిథియం కోసం చైనాపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లిథియం కోసం భారత్ ఇప్పటికీ చైనాపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు చైనా గుత్తాధిపత్యం ముగిసిపోయి గల్ఫ్ దేశాల తరహాల రాజస్థాన్ అదృష్టం మారబోతోందని నిపుణులు భావిస్తున్నారు. చైనా వద్ద 5.1 మిలియన్ టన్నుల లిథియం నిల్వ ఉంది. దీంతో చైనా లిథియం ప్రపంచ మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. అయితే ప్రస్తుతం బొలీవియా దేశంలో 21 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. అలాగే అర్జెంటీనా, చిలీ, అమెరికాలో కూడా లిథియం నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
లిథియం అనేది నాన్-ఫెర్రస్ మెటల్. ఇది మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఇతర ఛార్జ్ చేయగల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. లిథియం కూడా ప్రపంచంలోనే అత్యంత మృదువైన, తేలికైన లోహం. ఇది రసాయన శక్తిని నిల్వ చేసి విద్యుత్ శక్తిగా మారుస్తుంది. లిథియం నేడు ఇంటిలో దాదాపుగా ఛార్జ్ చేయగల ప్రతి ఎలక్ట్రానిక్ మరియు బ్యాటరీతో నడిచే గాడ్జెట్ లలో ఉంటుంది. ఈ కారణంగా, ప్రపంచవ్యాప్తంగా లిథియంకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్లోబల్ డిమాండ్ కారణంగా దీనిని వైట్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక టన్ను లిథియం ధర రూ.57.36 లక్షలు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2050 నాటికి, లిథియం మెటల్ కోసం ప్రపంచ డిమాండ్ 500 శాతం పెరుగుతుంది.
లిథియం కోసం ప్రస్తుతం భారతదేశం పూర్తిగా విదేశాలపై ఆధారపడి ఉంది. ఎక్కువ ధరలకు ఈ లోహాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పుడు GSI డెగానా చుట్టూ లిథియం భారీ నిల్వలను కనుగొంది. రాజస్థాన్లోని లిథియం నిక్షేపాలు దేగానా, దాని పరిసర ప్రాంతంలోని కొండలలో కనుగొన్నారు. ఇక్కడ నుండి టంగ్స్టన్ ఖనిజం ఒకప్పుడు దేశానికి సరఫరా చేశారు. బ్రిటీష్ పాలనలో 1914 సంవత్సరంలో డెగానాలోని రెయిన్వాట్ కొండలపై టంగ్ స్టన్ ఖనిజాన్ని కనుగొన్నారు.