ఫ్యూచర్స్లో రిలయన్స్ ట్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్:అజీం ప్రేమ్ జీ కూడా
బిగ్బజార్, సెంట్రల్ మాల్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ వంటి రిటైల్ స్టోర్లు నిర్వహించే కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు తన రిటైల్ సెగ్మెంట్లో మరింత వాటా అమ్మాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: బిగ్బజార్, సెంట్రల్ మాల్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ వంటి రిటైల్ స్టోర్లు నిర్వహించే కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు తన రిటైల్ సెగ్మెంట్లో మరింత వాటా అమ్మాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇందుకోసం విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్జీ నాయకత్వంలోని కన్సార్షియంతో చర్చలు నడుస్తున్నాయి. అదే సమయలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రిటైల్, అమెజాన్, సమర క్యాపిటల్తోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి.
also read:నవ రత్నాల ‘జియో’.. పోటెత్తుతున్న పెట్టుబడుల వరద
బిజినెస్ లాస్లు, లాక్డౌన్ వల్ల ఫ్యూచర్ గ్రూపు అప్పు విపరీతంగా పెరిగింది. డబ్బుకు కటకట ఏర్పడింది. దీంతో కిషోర్ బియానీ తన పూర్తివాటా లేదా కంపెనీలో మేజర్ వాటా అమ్మాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్లో ప్రేమ్జీ ఇన్వెస్ట్కు ఆరు శాతం, అమెజాన్కు 3.2 శాతం వాటాలు ఉన్నాయి. అయితే ఫ్యూచర్ రిటైల్లో నాన్–కంట్రోలింగ్ వాటా కొనడానికి సమర క్యాపిటల్ ఇది వరకే డాక్యుమెంట్లపై సంతకాలు కూడా చేసింది.
సెంట్రల్ డిపార్ట్మెంట్ చెయిన్ నిర్వహించే ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్లో వాటా కోసం రిలయన్స్ రిటైల్తో బియానీ మాట్లాడుతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్ వాటా కొంటే బియానీ గ్రూప్ లెవెల్లో పట్టు కోల్పోవాల్సి వస్తుంది.
వాటా అమ్మకం, కొనుగోళ్లపై స్పందించడానికి ప్రేమ్జీ ఇన్వెస్ట్, ఫ్యూచర్ రిటైల్, సమర క్యాపిటల్ ఇష్టపడలేదు. మీడియాలో వచ్చే వార్తలకు వివరణ ఇవ్వడం సాధ్యం కాదని రిలయన్స్ ఈ–మెయిల్ పంపింది. అయితే వివిధ అవకాశాలను కంపెనీ పరిశీలిస్తోందని మాత్రం తెలియజేసింది.
ఫ్యూచర్ రిటైల్ ఆదాయంలో 80 శాతం బిగ్ బజార్ హైపర్ మార్కెట్ల నుంచే వస్తున్నది. కరోనాను అడ్డుకోవడానికి మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యూచర్ తన రిటైల్ స్టోర్లన్నింటినీ మూసివేయాల్సి వచ్చింది.
కరోనాకు ముందే ఫ్యూచర్ గ్రూపునకు డబ్బు సమస్యలు ఉండగా, కరోనా తరువాత ఇవి మరింత పెరిగాయి. ఈ గ్రూపులో ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉండగా, వీటి అప్పు విలువ రూ.12,778 కోట్లకు చేరింది.
ఫ్యూచర్ కార్పొరేట్ రిసోర్సెస్ అండ్ ఫ్యూచర్ కూపన్స్లోని 42 శాతం వాటా ద్వారా బియానీ ఫ్యూచర్ గ్రూపునకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన తన 75 శాతం షేర్లను బ్యాంకులకు, ఇతర ఫైనాన్షియల్ కంపెనీలకు తనఖా బెట్టారు.
ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్కు ఇది ఈ ఏడాది మార్చిలో అప్పును చెల్లించలేక డిఫాల్ట్ అయింది. దీంతో ఐడీబీఐ బియానీ షేర్లను స్వాధీనం చేసుకుంది. ఏడాదిపాటు ఆ షేర్లను అమ్ముకోకుండా చట్టపరమైన రక్షణ కోసం గ్రూపు ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దీని మార్కెట్ వాల్యూ మూడువంతులు పడిపోయింది. రాబోయే రెండేళ్లలో ఫ్యూచర్ కార్పొరేట్ రిసోర్సెస్ అండ్ ఫ్యూచర్ కూపన్స్ రూ.1.045 కోట్ల అప్పు కట్టాలి.
రుణ వాయిదాలు చెల్లించడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోవడానికే రిటైల్ సెగ్మెంట్లో మరింత వాటా అమ్మాలని ఫ్యూచర్స్ గ్రూప్ నిర్ణయించుకుంది. 2013లో ఏర్పడ్డ ఫ్యూచర్ గ్రూపు సూపర్మార్కెట్లు, హైపర్మార్కెట్లు, డిస్కౌంట్ స్టోర్లు, ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్, మీడియా వ్యాపారాలు నిర్వహిస్తోంది.