నవ రత్నాల ‘జియో’.. పోటెత్తుతున్న పెట్టుబడుల వరద
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ జియో ప్లాట్ఫామ్స్లోకి నిధుల వరద కొనసాగుతోంది. జియో ప్లాట్ఫామ్స్ తన వాటాల విక్రయ పరంపరను కొనసాగిస్తూనే ఉంది.
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ జియో ప్లాట్ఫామ్స్లోకి నిధుల వరద కొనసాగుతోంది. జియో ప్లాట్ఫామ్స్ తన వాటాల విక్రయ పరంపరను కొనసాగిస్తూనే ఉంది.
అమెరికాకు చెందిన టీపీజీ క్యాపిటల్ జియోలో రూ. 4545.8 కోట్ల పెట్టుబడితో 0.98 శాతం వాటా కొనుగోలు చేసింది. ఎల్ క్యాటర్టన్ రూ.1,894.50 కోట్ల పెట్టుబడితో 0.39 శాతం వాటాలను చేజిక్కించుకుంది.
పెట్టుబడుల మ్యాగ్నెట్ ముఖేశ్ అంబానీ కుదుర్చుకున్న తొమ్మిదో ఒప్పందం ఇది. టీపీజీ, ఎల్ క్యాటర్టన్ పెట్టుబడులతో జియో ప్లాట్పామ్స్ సేకరించిన మొత్తం రూ.1,04,326.65 కోట్లకు చేరింది.
కాగా జియో ప్లాట్ఫామ్స్లో రిలయన్స్ విక్రయించిన వాటా మొత్తం కూడా 22.38 శాతానికి చేరింది. రిలయన్స్ను రుణరహిత సంస్థగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముఖేశ్ అంబానీ సంస్థ వాటాల అమ్మకం ద్వారా నిధులను సమీకరిస్తున్నారు.
జియో ప్లాట్ఫామ్స్తో ఏప్రిల్ 22వ తేదీన తొలుత ఫేస్బుక్ వాటాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే సిల్వర్లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెట్టుబడులు పెట్టాయి.
ఏప్రిల్ 22న జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ డిజిటల్ బిజినెస్ (జియో ప్లాట్ఫామ్స్) లో ఫేస్బుక్ 9.99 శాతం వాటా కొనుగోలు చేసింది.
అంటే సుమారు 5.7 బిలియన్ల డాలర్లతో అంటే రూ.43,574 కోట్ల విలువైన ఆ వాటాను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. దీంతో జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఫేస్ బుక్ నిలుస్తుంది. జియో ఫ్లాట్ఫామ్లో స్వల్ప పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ తెలిపారు.
జియోలో ఓ టెక్నాలజీ కంపెనీ ఇంత పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. భారత టెక్నాలజీ రంగంలోనూ ఇదే అతిపెద్ద ఎఫ్డీఐ కావడం విశేషం.
అటుపై అమెరికాకు చెందిన పీఈ జెయింట్ సంస్థ సిల్వర్ లేక్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. సిల్వర్ లేక్ సంస్థ రూ.5,665.75 కోట్లతో జియోలో 1.15 శాతం వాటా తీసుకుంది.
మే నెల 8న అమెరికాకి చెందిన మరో దిగ్గజ సంస్థ విస్టా ఈక్విటీ పార్టనర్స్ 2.32 శాతం వాటా కోసం రూ.11,367 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. ఇదే నెల 17న మరో గ్లోబల్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ రూ.6,598.38 కోట్లతో 1.34 శాతం వాటా కొనుగోలు చేసింది.
జనరల్ అట్లాంటిక్ సంస్థతో ఒప్పందంతో జియోకు ఇది ఎంటర్ప్రైజ్ విలువ రూ.5.16 లక్షల కోట్లుగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. కేకేఆర్ సంస్థ 2.32 శాతం వాటాతో రూ.11,367 కోట్లు, రెండో దఫా సిల్వర్ లేక్ పార్టనర్స్ 0.93 శాతం వాటాతో రూ.4546.80 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
అబుదాబీ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ 1.16 శాతంతో సమానమైన వాటాతో రూ.5,683.50 కోట్లు, టీపీజీ 0.93 శాతం వాటాతో రూ.4546.80 కోట్లు, ఎల్ కేటర్టన్ 0.39 శాతం వాటా కొనుగోలుతో రూ.1894.50 కోట్ల పెట్టుబడి పెట్టాయి. దీంతో 22.38 శాతం వాటా విక్రయంతో రిలయన్స్ జియో రూ.1,04,326.90 కోట్ల పెట్టుబడులను సమీకరించింది.