Asianet News TeluguAsianet News Telugu

Budget 2020:బడ్జెట్ సూట్​కేస్ వాడకంలో ట్రెండ్ మార్చిన నిర్మల’మ్మ...మరి ఈసారెలా ?!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో శనివారం బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దాదాపు దేశ ప్రజలంతే దీని గురించే చర్చించుకుంటున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్​ ఇది. సామాన్యులకు ఎలాంటి వరాలు కురిపించనుంది? రైతుల కోసం ఏం చేస్తుంది? వంటి ప్రశ్నలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఆర్థికశాఖ మంత్రి చేతిలోని సూట్‌కేసే.  
 

A brief history of the budget briefcase
Author
Hyderabad, First Published Feb 1, 2020, 10:03 AM IST

న్యూఢిల్లీ: బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం శనివారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నది. గతేడాది జూలైలో సూట్​కేసు సంప్రదాయానికి చెక్​ పెట్టి, ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈసారి ఎలా వస్తారని ఆసక్తి నెలకొంది.

బడ్జెట్​ ప్రతులు తెచ్చే ఈ సూట్​కేస్​కు ఓ చరిత్ర ఉందని తెలుసా? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? కాలక్రమేణా రంగులు, పరిమాణంలో మార్పుల గురించి విన్నారా? అసలు ఈ బడ్జెట్​కు, లెదర్ సూట్ కేసుకు సంబంధం ఏమిటో తెలుసుకుందాం..భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్​కే షన్ముఖం​ శెట్టి 1947లో లెదర్​ బ్యాగ్​ వినియోగించారు.1956-58, 1964-66 సమయంలో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఫైల్​ బ్యాగ్​తో పార్లమెంటులో అడుగుపెట్టారు.1958లో జవహర్​లాల్​ నెహ్రూ నలుపు రంగు బ్రీఫ్​కేసు వాడారు.

also read Budget 2020: ఆర్థిక సర్వే హైలేట్స్... రైతు పంట రుణాలతో నెగెటివ్ ఫలితాలు...

1998-99లో నాటి వాజపేయి సర్కార్‌లో ఆర్థిక మంత్రి యశ్వంత్​ సిన్హా ఎరుపు రంగుకు దగ్గరగా ఉన్న బడ్జెట్​ బాక్స్​తో పార్లమెంట్‌కు వచ్చారు. ఇక దేశానికి సంస్కరణలను పరిచయం చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గనిర్దేశం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ ఆర్థిక మంత్రిగా 1991-92లో తొలిసారి బ్రిటన్​ తొలి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్​ గ్లాడ్​స్టోన్ వినియోగించిన బ్రీఫ్​కేస్​ను పోలిన నలుపు రంగు బ్యాగ్​ వాడారు.

A brief history of the budget briefcase

ప్రస్తుత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ అందరిలా కాకుండా చెర్రీ ఎరుపు రంగు సూట్​కేసులో బడ్జెట్​ పత్రాలను పార్లమెంటుకు తీసుకు వచ్చి ప్రత్యేకంగా నిలిచారు. బ్రిటన్​ మాజీ ప్రధాని గ్లాడ్​స్టోన్​ తరహాలో సాదా గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు బ్రీఫ్​కేసుల్ని వినియోగించారు చిదంబరం.

also read Budget 2020:పార్లమెంటులో ఆర్థిక స‌ర్వే ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి నిర్మ‌ల‌...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో తొలివిడుత ఎన్డీఏ సర్కార్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ జైట్లీ మొదటి రెండు సంవత్సరాలు గోధుమ రంగు, లేత గోధుమ రంగు బ్యాగ్​లు వాడారు. 2017లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముదురు గోధుమ రంగు బ్యాగ్​ వాడారు. ఇదిలా ఉంటే అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ చికిత్స కోసం అమెరికా వెళ్లడంతో 2019 ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి హోదాలో పీయూష్ గోయల్ ఎరుపు రంగు సూట్​కేసుతో పార్లమెంట్​లోకి అడుగుపెట్టారు.

గతేడాది ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జులై 5న బడ్జెట్​ సమయంలో సూట్‌కేసుతో పార్లమెంటుకు వచ్చే సంప్రదాయానికి చెక్ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్ధిక శాఖ ప్రముఖులతో కలిసి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ పత్రాలు తీసుకొచ్చారు. తాజాగా శనివారం నిర్మలా సీతారామన్ తొలి పూర్తిస్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మళ్లీ ఆమె​ ఏ రకంగా పార్లమెంటులో అడుగుపెడుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios