Asianet News TeluguAsianet News Telugu

Budget 2020: ఆర్థిక సర్వే హైలెట్స్... రైతు పంట రుణాలతో నెగెటివ్ ఫలితాలు...

ఆదాయం తగ్గిపోవడంతో కష్టాల నుంచి బయట పడేందుకు ఆర్థిక సర్వే నరేంద్రమోదీ సర్కార్‌కు పరిష్కార మార్గాలు చూపింది. ఆహార సబ్సిడీలకు కోత విధించాలని, లేదా ధరలను హేతుబద్ధీకరించాలని సూచించింది. రూ. లక్షల కోట్లకు పైగా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిన కేంద్ర సర్కార్.. అన్నపూర్ణలా దేశానికి అన్నం పెడుతున్న రైతు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తే రుణ సంస్కృతికి విఘాతం కలుగడంతోపాటు రైతులకు వ్యవసాయ రుణాల లభ్యత తగ్గుతుందని చెప్పింది.

Economic Survey 2020 takes a cue from China for creation of 8 crore jobs
Author
Hyderabad, First Published Feb 1, 2020, 9:52 AM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖజానాకు పన్ను రాబడి తగ్గుతుండటంతో భారం తగ్గించుకోవడానికి ఆహార సబ్సిడీని కుదించుకోవాలని ఆర్థిక సర్వే  స్పష్టం చేసింది. 2025 నాటికి భారత్‌ 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపుదలతోపాటు మార్కెట్లకు సాధికారత కల్పించడం, వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంపొందించడం ఎంతో కీలకమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. 

కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, పన్నుల చెల్లింపు, కాంట్రాక్టుల అమలు లాంటి కార్యకలాపాలను సులభతరం చేసేందుకు సంస్కరణలు చేపట్టాలని సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు రెట్టింపు స్థాయికి (5 లక్షల కోట్ల డాలర్లకు) పెంచుకోవాలంటే ‘ప్రపంచం కోసం భారత్‌లో అసెంబ్లింగ్‌' (అసెంబుల్‌ ఇన్‌ ఇండియా ఫర్‌ ది వరల్డ్‌) అనే భావనతో తయారీ రంగానికి ఊతమివ్వాలని ఆర్థిక సర్వే వివరించింది. 

దీంతోపాటు రానున్న మూడేళ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి 1.4 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక సర్వే ఉద్ఘాటించింది. అధిక లాభదాయకత కోసం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, మార్కెట్లలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. 

also read Budget 2020:పార్లమెంటులో ఆర్థిక స‌ర్వే ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి నిర్మ‌ల‌...

ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 6 నుంచి 6.5 శాతానికి పెరుగుతుందని 2019-20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతానికి దిగజారి దశాబ్ద కాల కనిష్ఠస్థాయికి పడిపోయిన స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటుకు ఊతం ఇచ్చేందుకు ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సర్వే సూచించింది. 

ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడి ఉండటం, ఆర్థిక వృద్ధిని సాధించడంలో ఏదో ఒకటే సాధ్యమవుతుందని ఈ సర్వే తేల్చిచెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే ఆర్థిక సర్వేను శుక్రవారం విడుదల చేశారు. 

2008-09లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తిన నాటినుంచి ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గుతుండటంతోపాటు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటును, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, సంపదను, ఉద్యోగాలను సృష్టించేవారిని గౌరవించాలని ఆర్థిక సర్వే పేర్కొన్నది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు ఐదు శాతానికి పరిమితం అవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. గత 11 ఏళ్లలో ఇదే అత్యల్ప వృద్ధిరేటు. ఈ నేపథ్యంలో వృద్ధిరేటును పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. 

Economic Survey 2020 takes a cue from China for creation of 8 crore jobs

పెట్టుబడుల వ్యయాన్ని పెంపొందించడం, రెవెన్యూ వ్యయాన్ని తగ్గించుకోవడం ఆస్తుల సృష్టికి దారితీస్తుందని, దీంతో పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుందని తెలిపింది. దేశంలో వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టడంతోపాటు నౌకాశ్రయాల్లో అలసత్వ ధోరణిని తొలిగించి ఎగుమతులను పెంపొందించాలని, ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరును మెరుగుపరిచి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్థిక సర్వే పేర్కొన్నది. 

ప్రపంచ ఎగుమతుల్లో భారత్‌ వాటాను గణనీయంగా పెంచుకోగలిగితే 2025 నాటికి నాలుగు కోట్ల ఉద్యోగాలు, 2030 నాటికి ఎనిమిది కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఉద్యోగాల కల్పనకు చైనా అనుసరిస్తున్న విధానాలను భారత్‌ అనుసరించాలని సూచించింది. 

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై ఒత్తిడి పెరుగడం, కుటుంబాల ఖర్చు తగ్గిపోవడం, ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు మందగించడం, పన్ను వసూళ్లు తగ్గడం ప్రస్తుతం భారత్‌ ముందున్న సవాళ్లని పేర్కొన్నది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రానికి ఉన్న వాటాలను ఓ కొత్త సంస్థను ఏర్పాటుచేసి దానికి బదిలీ చేయాలని, ఆయా కంపెనీల్లో ప్రభుత్వ వాటాల విక్రయాన్ని ఆ సంస్థే చూసుకొనేలా ఉండాలని సూచించింది. 

వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు మెరుగైన చర్యలు చేపడుతున్న దేశాల జాబితాలో భారత్‌ స్థానం గణనీయంగా మెరుగుపడిందని, 2014 నాటికి ఈ జాబితాలో 142వ ర్యాంకులో నిలిచిన భారత్‌ ప్రస్తుతం 79 స్థానాలను మెరుగుపర్చుకొని 63వ స్థానానికి ఎగబాకిందని తెలిపింది. పెట్టుబడులకు మూలధనం తగ్గింపు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పేర్కొన్నది.

వ్యవసాయరంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2.9 శాతంగా ఉంటుందని భావిస్తున్న వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.8 శాతానికి తగ్గవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఉండవచ్చని, గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది తక్కువని పేర్కొన్నది. 

2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌ పథకం కింద 47.33 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందని, స్వచ్ఛభారత్‌ కార్యక్రమం కింద 2014 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్లకుపైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని తెలిపింది. 

Economic Survey 2020 takes a cue from China for creation of 8 crore jobs

2018లో ఏకంగా 1.24 లక్షల కంపెనీలు ఏర్పాటయ్యాయని, ఈ విషయంలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించింది. 2018-19లో రైల్వే ప్రయాణికుల సంఖ్య 1.85 శాతం పెరిగి 840 కోట్లకు, సరుకుల లోడింగ్‌ 5.34 శాతం పెరిగి 120 కోట్ల టన్నులకు చేరిందని, దీంతో ఇండియన్‌ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్‌ క్యారియర్‌ గా, సరుకు రవాణాలో నాలుగో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించిందని సర్వే పేర్కొన్నది.

దేశంలో సంపదను సృష్టించడంపై ఆర్థిక సర్వే దృష్టిసారించిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పరిశ్రమలు, ఎగుమతులు, వ్యాపారాన్ని సులభతరం చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచేందుకు అనుసరించాల్సిన బహుముఖ వ్యూహాన్ని ఈ సర్వే వివరించిందని ఆయన ట్వీట్‌ చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నెమ్మదిగా పుంజుకొంటుందని, మున్ముందు ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని, పెట్టుబడులు తగ్గుతాయన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో వృద్ధిరేటుపై ఈ సర్వే అంచనాలు అత్యాశతో కూడినవిగా ఉన్నాయని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. 

దేశ వృద్ధిరేటును అంచనా వేయడంలో ఈ సర్వే గత ఐదేళ్లలో నాలుగేళ్లుగా విఫలమైంది. ప్రజలిచ్చిన బలమైన తీర్పును మోదీ ప్రభుత్వం సంస్కరణల అమలు వేగాన్ని పెంచేందుకు, ఇది 2020-21లో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకొనేందుకు దోహదపడుతుందని ఆర్థిక సర్వే పేర్కొన్నది. 

2011 తర్వాత దేశ జీడీపీ వృద్ధిరేటును 2.7 శాతం మేరకు అతిగా అంచనా వేశారని కేంద్ర ఆర్థికశాఖ మాజీ సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ చేసిన ఆరోపణను ఈ సర్వే రూపకర్త, ఆర్థికశాఖ ప్రస్తుత సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తోసిపుచ్చారు. ఈ ఆరోపణ నిరాధారమైనదని, గణాంకాలతో సరితూగడంలేదని ఆయన పేర్కొన్నారు.

also read ఆర్ధిక మంత్రిగా నిర్మల’మ్మ రికార్డ్: కొత్త ఆర్థిక మంత్రిగా నెక్స్ట్ ఎవరు..?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 5 శాతంగా ఉంటుందని భావిస్తున్న జీడీపీ వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 నుంచి 6.5 శాతం వరకు పెరుగుతుందని అంచనా ఆర్థిక సర్వే అంచనా వేసింది. వృద్ధిరేటు పునరుద్ధరించేందుకు ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించడం అవశ్యం అని ఆర్థిక సర్వే పేర్కొంది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగడం, డిమాండ్‌పై ఒత్తిడి, జీఎస్టీ ఆదాయంలో సానుకూల వృద్ధి నమోదవడం లాంటి 10 అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో వృద్ధిరేటు పెరుగుదలకు దోహదం చేశాయని ఆర్థిక సర్వే వివరించింది. 2025నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరాలంటే నైతిక పద్ధతుల్లో సంపదను సృష్టించడం కీలకం అని స్పష్టం చేసింది.

2011-12 ఆర్థిక సంవత్సరంలో 17.9 శాతంగా ఉన్న సంఘటితరంగ ఉద్యోగిత వాటా 2017-18లో 22.8 శాతానికి పెరుగడం ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణను ప్రతిబింబిస్తున్నదని ఆర్థిక సర్వే పేర్కొన్నది. 2011-18 మధ్యకాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 2.62 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని వివరించింది.

2011-12 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017-18లో రెగ్యులర్‌ ఉద్యోగాలు పొందిన మహిళల సంఖ్య 8 శాతం పెరిగిందని ఆర్థిక సర్వే తెలిపింది. బకాయిల రద్దుతో రుణ సంస్కృతికి విఘాతం కలుగడంతోపాటు రైతులకు వ్యవసాయ రుణాల లభ్యత తగ్గుతుందని చెప్పింది.

ప్రభుత్వరంగ బ్యాంకుల సిబ్బంది పనితీరును మెరుపరిచి వాటిపట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆర్థిక సర్వే  సూచించింది. గతేడాది ఏప్రిల్‌లో 3.2 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 2.6 శాతానికి తగ్గడం ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ ఒత్తిడి బలహీనంగా ఉండటాన్ని ప్రతిబింబిస్తున్నదని వివరించింది. గతేడాది ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య కాలంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 4.1 మేరకు పెరిగాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios