వివేకా హత్య: చంద్రబాబుపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
బాబాయ్ హత్యలో మంత్రి ఆదినారాయణరెడ్డికి కానీ, టీడీపీ నేతలకు కానీ, బాబుకు కానీ సంబంధం లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకి ఎందుకు ఒప్పుకోవడం లేదో చెప్పాలని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రశ్నించారు
అమరావతి: బాబాయ్ హత్యలో మంత్రి ఆదినారాయణరెడ్డికి కానీ, టీడీపీ నేతలకు కానీ, బాబుకు కానీ సంబంధం లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకి ఎందుకు ఒప్పుకోవడం లేదో చెప్పాలని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రశ్నించారు
సోమవారం నాడు ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మా కుటుంబంలో మా పెద్దనాన్న జార్జిరెడ్డి పెద్ద. ఆయన లేరు, ఆ తర్వాత మా నాన్న వైఎస్ఆర్ . ఆయన కూడ లేరనే విషయాన్ని ఆమె ప్రస్తావించారు. తమ కుటుంబానికి వైఎస్ వివేకానందరెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారని ఆమె చెప్పారు.
తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవన్నారు. ఒకవేళ గొడవలు ఉంటే చంపుకొంటామా అని ఆమె ప్రశ్నించారు. మీ కుటుంబంలో గొడవలు ఉంటే ఇలాగే హత్య లు చేస్తారా అని ఆమె మీడియా ప్రతినిధిని ప్రశ్నించారు.
వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేశారని ఆమె చెప్పారు. ఈ హత్య చూస్తే మనుషులా... మృగాలా అని కూడ అనిపిస్తోందన్నారు. వివేకానందరెడ్డి హత్యకు గురైన తమ కుటుంబం బాధితులమని చెప్పారు. కానీ, ఈ హత్యను తామే చేశామని టీడీపీ నేతలు, చంద్రబాబునాయుడు మాట్లాడడాన్ని ఆమె తప్పుబట్టారు.
బాధితులనే నిందితులుగా చేర్చే కుట్ర జరిగితే తాము ఆత్మరక్షణలో పడుతామన్నారు. టీడీపీ నేతలు ఇదే స్ట్రాటజీని అవలంభిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో అసలైన నిందితులు స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశం దొరుకుతోందన్నారు.
చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారని ఆమె గుర్తు చేశారు. ఇవాళ చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలోనే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారని ఆమె ప్రస్తావించారు. రాజారెడ్డి హత్య కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్నారు. వివేకానందరెడ్డి హత్యలో కూడ టీడీపీ నేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు.
మంత్రి ఆదినారాయణరెడ్డి, చంద్రబాబునాయుడుకు, టీడీపీకి సంబంధం లేకపోతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును థర్డ్ పార్టీ ఎంక్వైరీకి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
జయంతికి, వర్థంతికి తేడా తెలియదు: లోకేష్పై షర్మిల సెటైర్లు
చంద్రబాబువి అన్నీ అబద్దపు హామీలే: వైఎస్ షర్మిల
చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు