ఈసీ చెప్పేదేమిటి: ఏపీలో మొరాయించిన ఈవీఎంలెన్ని
ఈ నెల 11వ తేదీన జరిగిన పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద అర్ధరాత్రి వరకు కూడ ఓటర్లు బారులు తీరారు. చాలా కేంద్రాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని అధికార పార్టీ ఆరోపిస్తోంది
అమరావతి: ఈ నెల 11వ తేదీన జరిగిన పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద అర్ధరాత్రి వరకు కూడ ఓటర్లు బారులు తీరారు. చాలా కేంద్రాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. కానీ, కేవలం మూడు వందలకు పైగా ఈవీఎంలలోనే మాత్రమే సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు.
ఈ నెల 11వ తేదీన ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ప్రారంభమైన సమయంలో సుమారు 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని టీడీపీ ఆరోపణలు చేసింది.
అయితే ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించిన కారణంగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైనట్టుగా చెబుతున్నారు. అయితే ఎక్కడైతే ఈవీఎంలలో ఇబ్బందులు వచ్చాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో వెంటనే ఈవీఎంలను మార్చినట్టుగా ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని కొన్ని చోట్ల మధ్యాహ్నాం 1 గంట వరకు కూడ పోలింగ్ ప్రారంభం కాలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే పోలింగ్ ఆలస్యమైందని చెబుతున్నారు. ఈవీఎంలు సరిగా పనిచేస్తే నిర్ణీత కాల వ్యవధిలోనే పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పోలింగ్ రోజున సాయంత్రం ఆరు గంటల నుండి ఈ నెల 12వ తేదీ తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగాయి.
అయితే పోలింగ్ నిర్ణీత కాలవ్యవధిలో ఎందుకు పూర్తి కాలేదనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ రోజున సుమారు 92 వేలకు పైగా ఈవీఎంలను ఉపయోగిస్తే అందులో 381 ఈవీఎంలలో సమస్యలు వచ్చాయని ఈసీ ప్రకటించింది.
సంబంధిత వార్తలు
ఫ్యాన్కు పడకపోతే ఊరుకొనేవాడిని కాదు: చంద్రబాబుకు జగన్ కౌంటర్
పోలింగ్ దాడులపై గవర్నర్కు వైఎస్ జగన్ ఫిర్యాదు