చంద్రబాబు బానిసల గొలుసులు విప్పి ఉసిగొల్పుతున్నాడు: పోతిరెడ్డిపాడుపై విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పోతిరెడ్డిపాడు జీవోపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
అమరావతి: పోతిరెడ్డిపాడుపై వస్తున్న వ్యతిరేకతకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని తప్పు పట్టారు. చంద్రబాబుపై ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల్లోకి తాను పంపించిన బానిసల గొలుసులు విప్పి పోతిరెడ్డిపాడు జీవోపై ఉసిగొల్పుతున్నాడని ఆయన చంద్రబాబును నిందించారు.
వాళ్లెంత మొరిగినా న్యాయం అనేది ఒకటుంటుందని, ఏపీ తన కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడా అక్రమంగా తీసుకోదని సీఎం జగన్ స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. మౌనీ బాబా నోరు విప్పాలని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
Also Read: అది వైఎస్ జగన్ అత్యాశే: పోతిరెడ్డిపాడుపై గుత్తా సుఖేందర్ రెడ్డి
"చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయి అర్థశత దినోత్సవం పూర్తయింది. కరోనా కష్ట సమయంలో రాష్ట్రాన్ని వదిలి ప్రతిపక్ష నేత ఎక్కడో ఉండటమేమిటని ఎల్లో మీడియా ప్రశ్నించదు. నలుగురు కూర్చుని ప్లకార్డులు పట్టుకుంటే అమరావతి దీక్షలు 150 రోజులకు చేరాయని వార్తలు వడ్డిస్తోంది" అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: జగన్ తో కేసీఆర్ సీక్రెట్ ఒప్పందం: పోతిరెడ్డిపాడుపై బండి సంజయ్
"అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరిస్తే జీతాలెలా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. తుప్పు, పప్పు రెండు నెలలుగా పొరుగు రాష్ట్రంలో ఉంటూ ప్రభుత్వ సదుపాయాలెలా ఉపయోగించుకుంటున్నారో చెప్పాలి. ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా?" అని ఆయన అన్నారు.