అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారత్: విశాఖలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
విశాఖపట్టణంలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
![Union Minister Rajeev chandrasekhar Participates Rojgar Mela in Visakhapatnam lns Union Minister Rajeev chandrasekhar Participates Rojgar Mela in Visakhapatnam lns](https://static-ai.asianetnews.com/images/01hpefk640g5bq9cr0jhe9h63t/rajeev-3-jpg_363x203xt.jpg)
విశాఖపట్టణం:భారత దేశం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సోమవారంనాడు విశాఖపట్టణంలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో కలిసి కేంద్ర మంత్రి రోజ్గార్ మేళాలో కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంలో లక్షమంది యువత రోజ్గార్ మేళాలో భాగస్వామ్యం కావడం శుభపరిణామమన్నారు.
ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ అంటూ పొరుగు దేశాలకు పోటీ ఇస్తోందన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశ ప్రజలకు అన్ని రంగాల్లోనూ సేవలందుతున్నాయని చెప్పారు. అనంతరం సీఐఎస్ఎఫ్ సహా పలు విభాగాల్లో ఖాళీల్ని భర్తీ చేస్తూ ఇచ్చే అపాయింట్ మెంట్ లెటర్లను 197మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఆయన అందజేశారు. అంతేకాకుండా ఆన్లైన్ లెర్నింగ్ మాడ్యూల్, కర్మ యోగీ పేరిట మాడ్యులర్ను ఆవిష్కరించారు. మోడీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చ్యువల్ కాన్ఫరెన్స్లో కూడ కేంద్ర మంత్రి పాల్గొన్నారు.
రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ దేశ వ్యాప్తంగా లక్ష మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించారు.వర్చువల్ గా ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోడీ పాల్గొన్నారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన ఉద్యోగాలకంటే ఎక్కువ ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగ వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రస్తావించారు.
రోజ్ గార్ మేళాలో భాగంగా ఉద్యోగ నియామకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడ ఉంటాయి.ఆన్ లైన్ లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడ నిరుద్యోగులకు రోజ్ గార్ మేళా ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.