Asianet News TeluguAsianet News Telugu

Top Stories : రైతుబంధు నిలిపివేత.. శ్రీవారి సన్నిధిలో ప్రధాని..ప్రచారంలో అగ్రనేతలు..పోలింగ్ కు అంతా సిద్ధం..

తెలంగాణలో మొదటిసారి బీజేపీ సర్కార్ రాబోతోందన్నారు ప్రధాని మోడీ. రైతుబంధు పంపిణీని తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్దం.. ఇలాంటి వార్తల టాప్ టెన్ స్టోరీస్ ఇవి... 

Top Stories : Rythubandhu suspension.. Prime Minister in the presence of Srivari.. Top leaders in campaign - bsb
Author
First Published Nov 28, 2023, 7:34 AM IST

రైతు బంధు పంపిణీ తక్షణమే నిలిపివేయాలి :  కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికలకు సమయం ముంగిట్లోకి వచ్చిన వేళ కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. సోమవారం తెలంగాణలో రైతుబంధు పథకం నిధుల పంపిణీ తక్షణం నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మాట్లాడారని ఈసీ వెల్లడించింది. ఈ మేరకు దీని మీద వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తున్నట్లుగా తెలిపింది. దీని మీద బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ ను ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరింది. దీనికి సంబంధించిన ‘రైతుబంధు పంపిణీకి అనుమతి నిలిపివేత’ పేరుతో ఈనాడు బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.

రైతు బంధు పంపిణీకి బ్రేక్.. అనుమతి రద్దు చేసిన ఈసీ...

తెలంగాణలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం.. మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన 3 రోజుల పర్యటన సోమవారంతో ముగిసింది. సోమవారం నాడు మహబూబాబాద్ జిల్లా జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ..  తెలంగాణలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ తెలిపారు. టిఆర్ఎస్ ను ఎట్టి పరిస్థితుల్లోని దగ్గరికి రానివ్వమని చెప్పుకొచ్చారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పథకంలోనూ  దోపిడీ తధ్యమని అన్నారు. టిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను తెచ్చుకోవడం అంటే ఒక జబ్బును వదిలించుకొని మరో రోగం తెచ్చుకోవడం లాంటిదని.. అలాంటిది చేయవద్దన్నారు. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ‘కెసిఆర్ ఖేల్ ఖతం’ పేరుతో ఈనాడు బ్యానర్ ఐటెంగా ప్రచురించింది.

ఫాం హౌస్ సీఎం మనకు అవసరమా.. ప్రధాని...

డిసెంబర్ 6న రైతుబంధు పంపిణీ..  కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కెసిఆర్ రైతుబంధు నిలిపివేత మీద  ప్రచార సభల్లో మండిపడ్డారు. కాంగ్రెస్ వల్లే ఇది జరిగిందని, అన్నదాతల నోటి కాడి ముద్ద లాక్కుంది దుష్ట కాంగ్రెస్ అని విరుచుకుపడ్డారు. మూడోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖాయమని.. డిసెంబర్ 6వ తేదీన  రైతుబంధు నిధులు వేస్తామని అన్నారు. కెసిఆర్ బతికున్నంత కాలం రైతుబంధు నిధులు ఆగే ప్రసక్తి లేదని అన్నారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మంత్రివర్గ సమావేశంలోనే భూముల పట్టాలకు చర్యలు చేపడతామన్నారు. ఈ వార్తను ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది.

రైతు బంధు

బీఆర్ఎస్ కు మళ్ళీ అవకాశం ఇస్తే…

సోమవారం నాడు తెలంగాణలోని భువనగిరి గద్వాల, కోస్గి, కొడంగల్ సభల్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ టీపీసీసీ చైర్మన్ రేవంత్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా మారిందని ప్రియాంక గాంధీ అన్నారు. ఆ పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించాలని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్న పని జరగాలన్నా కమిషన్ ఇచ్చుకోవాలని ఆ డబ్బు బిఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తుందని చెప్పుకొచ్చారు. పోల్ మేనేజ్మెంట్ పేరుతో ఇప్పుడు ఓటర్లకు పెద్ద మొత్తంలో ఇవ్వబోతున్నారని ఆ డబ్బంతా.. మీదే.. మీకే చెందాలంటే చెప్పుకు వచ్చారు.  మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే ధరణితో మిగిలిన భూములన్నిటిని లూటీ చేస్తారని, అవినీతి ఆకాశానికి అంటుతుందని, పేపర్ లీకులు కొనసాగుతాయని తీవ్రస్థాయిలో విమర్శలకు ఇప్పించారు. ఈ వార్తలోనే…ఇందిరాగాంధీని దూషిస్తున్న కేసీఆర్ ను పంపాలని  మల్లికార్జున కార్గే చేసిన వ్యాఖ్యలను, ఉద్యోగాల భర్తీనే తమ తొలి ప్రాధాన్యం అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించారు.

బీఆర్ఎస్ ధనిక పార్టీగా ఎలా మారింది?.. ప్రియాంక గాంధీ

దిక్కుతోచని ‘దేశం’.. 

ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గ్యాంగ్ లో కంగారు పుడుతోందని ఓ ప్రత్యేక కథనాన్ని బ్యానర్ ఐటమ్ గా సాక్షి ప్రచురించింది. వైఎస్ఆర్సిపి చేస్తున్న సామాజిక సాధికారయాత్ర, వై ఏపీ నీడ్స్ జగన్ కు జనం నీరాజనం  పడుతున్నారని  తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వైయస్ జగన్ అమలు చేశారని.. అన్ని వర్గాలకు దగ్గరయ్యారని చెప్పుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయ డంకా మోగిస్తుందని,  ఈసారి..  గత ఎన్నికల్లో టిడిపి గెలిచిన 23 స్థానాల్లో కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దించబోతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తేల్చాయని  చెప్పుకొచ్చింది. తెలుగుదేశం జనసేన పొత్తుకు జనంలో స్పందన కనిపించలేదు. పచ్చ మీడియాకి బాబు, లోకేష్, పవనులతో పాటు పురందరేశ్వరి కూడా మద్దతిస్తుందని సాక్షి పేర్కొంది. 

అంబేద్కర్ స్మృతి వనం పనులు జనవరి 15 నాటికి పూర్తి

ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.  అంబేద్కర్ స్మృతి వనం చారిత్రాత్మకమని.. ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం, ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ స్మృతి వనాన్ని ‘స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ కాన్సెప్ట్ గా నిర్మిస్తున్నామన్నారు. దీని ప్రారంభోత్సవం నాటికి పనులన్నీ పూర్తి కావాలని ఏదీ పెండింగ్లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు.  స్మృతి వనంలో కన్వెన్షన్ సెంటర్ పనులు పూర్తిస్థాయిలో పూర్తి కావాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు జనవరి 15 నాటికి పనులన్నీ పూర్తయ్యేలా చూస్తామన్నారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనాన్ని జనవరి 24న ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పుకొచ్చారు.  ఈ వార్త కథనాన్ని సాక్షి మెయిన్ పేజీలో ప్రచురించింది.

శ్రీవారిని అలా వేడుకున్నా ..  ప్రధాని 

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి తిరుమల  వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ వార్తను సాక్షి మెయిన్ పేజీలో ఫోటోతో సహా ప్రచురించింది. సోమవారం ఉదయం 8 గంటల కంటే ముందే ఆలయ మహా ద్వారం నుంచి లోపలికి ప్రవేశించిన ప్రధాని.. ఆ తర్వాత గర్భగుడిలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 140  కోట్ల మంది భారతీయులు సంతోషంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నానని చెప్పుకొచ్చారు. 

తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాని మోడీ..

రండి.. ఓటెయ్యండి..

తెలంగాణలో  పోలింగ్కు సర్వం  సిద్ధమైనట్లుగా ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ప్రచురించింది. ఈనెల 30వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, 29వ తేదీన ఈవీఎంల పంపిణీ ఉంటుందని ఇందులో పేర్కొంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపింది. పోలింగ్ సమయంలో అధికారుల ట్విట్టర్ పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని  పేర్కొంది. ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ దీనికి సంబంధించిన వివరాలను సోమవారం వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా  ఉన్న పోలింగ్ కేంద్రాలలో  తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.

అంబర్పేటకి మెట్రో…

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేట్ అలీకేట్ చౌరస్తాలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుదలలో భాగంగానే అంబర్పేటకు మెట్రో వేస్తామని..మూసీ సుందరీ కరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఓటమి భయంతోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్పేట్ లో పోటీ చేయకుండా తప్పుకున్నారని ఆరోపణలు గుర్తించారు.  బిఆర్ఎస్ అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. ముస్లిం ప్రజల కోరిక మేరకు వారికి స్మశాన వాటికకు స్థలం కేటాయించామని, హిందువులు, క్రైస్తవులకు కూడా స్మశానవాటికలకు స్థలాలను కేటాయించామని పేర్కొన్నారు. నగరంలో రోజు మంచినీరు అందించే కార్యక్రమం చేపడతామన్నారు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వార్తని ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ప్రచురించింది.

హైదరాబాదులో ట్రాఫిక్ నరకం..

తెలంగాణలో ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతుండడంతో  అన్ని పార్టీలు ప్రచార జోరుని పెంచాయి.  దీంతో.. నేతల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో రోడ్లన్నీ జలమయం కావడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది.  స్కూల్లు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్లో ఈ ట్రాఫిక్ కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయని.. పేర్కొంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.  సోమవారం నాడు హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓవైపు ప్రధాని రోడ్ షో, మరోవైపు మంత్రి కేటీఆర్ రోడ్ షోలతో.. సెంట్రల్ జోన్ ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా ట్యాంక్ బండక, లిబర్టీ, లకిడికపూల్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్, విద్యానగర్, బర్కత్పురా, వీఎస్టీ, కాచిగూడ, ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని చుక్కలు చూసారు వాహనదారులు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios