తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఉగ్రవాదులు దాడులకు కుట్రలు పన్నిన విషయం బైటపడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. విజయవాడను హైఅలర్ట్ చేసారు. 

Vijayawada : తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు బైటపడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు ఉగ్రవాదంపై ఆకర్షితుడై హైదరాబాద్ వేదికగా భారీ బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన విషయం వెలుగుచూసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.. రద్దీ ప్రదేశాలు, బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో తనిఖీలను ముమ్మరం చేసారు.

ఈ క్రమంలోనే విజయవాడలో కూడా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే విజయవాడలోని రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేసారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో అనుమానితంగా కనిపించేవారికి క్షుణ్ణంగా తనికీ చేస్తున్నారు. ప్రయాణికుల లగేజ్‌ను కూడా తనిఖీ చేస్తున్నారు పోలీసులు.

విజయనగరం కు చెందిన సిరాజ్ ఉల్ రెహ్మాన్ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్ కు వెళ్లి ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. అతడు హైదరాబాద్ కు చెందిన మరో యువకుడితో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టాడు. హైదరాబాద్ లో భారీ ఉగ్రదాడికి సిద్దమైన రెహ్మాన్ భారీఎత్తున పేలుడు పదార్ధాలను సేకరించాడు. అయితే అతడి కుట్రలను భగ్నం చేసిన పోలీసులు అదుపులో తీసుకున్నారు.

సిరాజ్ తో పాటు బోయిగూడకు చెందిన సమీర్ అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్ పేరిట ఓ సంస్థను ఏర్పాటుచేసి ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారు. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా యువతను ఆకర్షించి తెలుగు రాష్ట్రాల్లో దాడులకు కుట్రలు పన్నినట్లు తెలుస్తోంది. సిరాజ్, సమీర్ ఇద్దరినీ అరెస్ట్ చేసారు... సిరాజ్ ను పోలీసులు విజయనగరం తరలించారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కుట్రలు బైటపడటంతో ప్రధాన నగరాల్లో తనిఖీలను ముమ్మరం చేసారు... భద్రతను కట్టుదిట్టం చేసారు.