ఈ నెల 24న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. 26న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి వర్షాల ప్రవేశిస్తాయని పేర్కొన్నారు.

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఈ నెల 24వ తేదీన తాకే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళను చేరుకుంటాయి. కానీ ఈసారి ముందే ప్రవేశించే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు, ఈ నెల 26నాటికి రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చరిత్రలో నిలిచే..

గతేడాది మే 30న రుతుపవనాలు కేరళను తాకాయి. ఇదే రోజు తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు ప్రారంభమయ్యాయి. ఒకేసారి రెండు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం కనిపించడం అరుదైన సంఘటన. ఈ ఏడాదీ అదే తరహా పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఐఎండీ గణాంకాల ప్రకారం, 2009లో మే 23న నైరుతి రుతుపవనాలు కేరళలోకి వచ్చాయి. ఈసారి అంచనాల ప్రకారం 24న ప్రవేశిస్తే, గత పదిహేనేళ్లలో అత్యంత తొందరగా నైరుతి రాకగా చరిత్రలో నిలిచే అవకాశం ఉంటుంది.

ఇక వాతావరణ వ్యవస్థల వివరాల్లోకి వెళితే, అరేబియా సముద్రంలో ఈ గురువారం ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. మరోవైపు బంగాళాఖాతం మీదుగా దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఐఎండీ నివేదిక ప్రకారం, బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నాటికీ ఈ వర్షాలు మరింత విస్తరించే సూచనలు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.