ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లాలో దారుణ సంఘ‌ట‌న జ‌రిగింది. దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం ఓ కుటంబంలో విషాదాన్ని నింపింది. కారు, లారీ ఢీకొట్ట‌డంతో ఆరుగురు మృతి చెందారు. 

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని తాటిచెర్ల మోటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. విహారయాత్రకు వెళ్లిన కుటుంబం కారులో తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలోనే చిన్నారులతో పాటు ఆరుగురు మరణించారు. వీరంతా బాపట్ల జిల్లాలోని స్టూవర్టుపురం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.

ప్రమాద సమయంలో వీరు నంద్యాల జిల్లా మహానంది ఆలయం సందర్శించి తిరిగి వస్తుండగా ఘటన జరిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుల పూర్తి వివరాలు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, బాధితులకు నాణ్య‌మై వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను మంత్రి సమీక్షించారు.