వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు వద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముంద‌స్తు బెయిల్ విష‌యంపై స్పందించిన ధ‌ర్మాస‌నం బెయిల్‌ను నిరాకక‌రించింది. ఇందుకు గ‌ల కార‌ణాలను వివ‌రించింది. 

సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకరమైన పోస్టులపై నమోదైన కేసులలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరయ్యే అవకాశాన్ని అత్యున్నత న్యాయస్థానం ఖండించింది. అయితే అరెస్టు చేయకుండా రెండు వారాలపాటు మధ్యంతర రక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సమయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

విచారణ సమయంలో జస్టిస్ పంకజ్ మిట్ట‌ల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. "మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూసిన తర్వాత మేము అర్థం చేసుకోలేమనుకుంటున్నారా? ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం గుర్తించలేమా? మీ పోస్ట్‌లు సహించలేని స్థాయిలో ఉన్నాయి. తప్పు ఎవరి నుంచైనా వచ్చినా అది తప్పే. ఈ వ్యవస్థ అలాంటి వ్యవహారాలను క్షమించదు తప్పక శిక్షిస్తుంది," అని మండిపడ్డారు.

ఇలాంటి అభ్యంతరకర పోస్టులకు, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన‌ కేసుల్లో త్వ‌ర‌గా బెయిల్ వస్తుందనే నమ్మకంతో ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. "ఇలాంటివారికి వెంటనే బెయిల్ ఇస్తే, ప్రతి ఒక్కరు తమకు నచ్చినట్టు వ్యవహరించడానికి ప్రోత్సహించిన‌ట్లు అవుతుంది" అని సుప్రీం హెచ్చరించింది.

ఈ తీర్పుతో, సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన లేదా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే వారిపై న్యాయవ్యవస్థ క‌ఠినంగా వ్య‌వ‌హరిస్తుంద‌నే సందేశాన్ని ఇచ్చింది.