ప్రధాని మోదీ చేతులమీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రూ.43 వేల కోట్ల పనులను ప్రధాని ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సింగపూర్ సాయంతో మాస్టర్ ప్లాన్ తయారు చేశామని, 365 కి.మీ ట్రంక్ రోడ్లు, 1500 కి.మీ లే ఔట్ రోడ్లు నిర్మించేలా ప్రణాళిక ఉందని అన్నారు. గతంలోనే రూ.41 వేలకోట్లకు పనులు ప్రారంభమయ్యాయని, ఇక 2019కు ముందు రూ.5 వేల కోట్ల పనులు జరగగా.. వాటికి బిల్లులు కూడా చెల్లించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ అమరావతికి వస్తున్న తరుణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాదాపు అయిదు లక్షల మంది జనాభా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని ప్రసంగించే వేదికతోపాటు.. మరో రెండు వేదికలను నిర్మిస్తారు. ప్రధాని కూర్చునే వేదికపై కేవలం 20 మంది మాత్రమే ముఖ్యఅతిథులు ఆశీనులు కానున్నారు. రెండో స్టేజీపై కూటమి నాయకులు 100 మంది వరకు కూర్చోనున్నారు. మూడో స్టేజీపై రాజధాని రైతుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రధాని సన్మానించనున్నారు.
ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్ వద్ద దిగనున్నారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర రోడ్డు షోలో పాల్గొంటారు. 15 నిమిషాలపాటు రోడ్డు షో ఉండనుంది.
ఇక 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ను సందర్శించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. తొలుత అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ సభలో ప్రసంగిస్తారు.
సభ ముగిసిన అనంతరం 5.10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు.
ఈ రోజు రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు. ఈక్రమంలో అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరారు. దీనిని పరిశీలించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.