Amaravati: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ ఘనంగా జరిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ.. తాను, చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌గ‌తికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే తాను చంద్ర‌బాబును చూసి నేర్చుకున్నాన‌ని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. బాబును చూసి ప్ర‌ధాని మోడీ ఏం నేర్చుకున్నారు?   

Amaravati-PM Modi: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో  ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించడమే కాక, మధ్య మధ్యలో తెలుగులో వ్యాఖ్యలు చేస్తూ ఆకట్టుకున్నారు. అమరావతి అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, అది ఆంధ్ర ప్రజల ఆశలకూ, భవిష్యత్తుకూ ప్రతీక అని స్పష్టం చేశారు.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాడు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

అమరావతి నగరం కాదు శక్తి: ప్రధాని మోడీ

అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది ఒక శక్తి అని అన్నారు. ఇది ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దే కేంద్ర బిందువుగా మారనుందని స్పష్టం చేశారు. 

రాజధాని అమరావతి  కల ఇప్పుడు సాకారమవుతోంది. చారిత్రక పరంపరతో పాటు అభివృద్ధి కలిసిపోతున్నాయి. బౌద్ధ వారసత్వంతో పాటు గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, విద్యా రంగాల్లో ఇది ముందంజలో ఉంటుందని మోడీ అన్నారు.

అమరావతితో వికసిత్ ఆంధ్ర‌కు పునాది :  మోడీ  

వికసిత్ భారత్‌కు ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇంజిన్ కావాలి. అమ‌రావ‌తితో విక‌సిత్ ఆంధ్ర‌కు పునాది అవుతుంద‌ని మోడీ అన్నారు. ఇది కేవలం శంకుస్థాపన కాకుండా, స్వర్ణాంధ్ర నిర్మాణానికి శుభసంకేతంగా పేర్కొన్నారు. గతంలో అమరావతికి ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయనీ, ఇప్పుడు రికార్డు స్పీడ్‌తో పనులు జరుగుతున్నాయని చెప్పారు. 

టెక్నాలజీపై చంద్రబాబు దూరదృష్టిని కొనియాడిన ప్ర‌ధాని మోడీ 

ప్రధాని తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ వినియోగంపై చూపిన ముందుచూపును గుర్తు చేశారు. "నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు, ఏపీ సీఎం చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించాను.. దానిని వాడ‌టం ఆయ‌న నుంచే నేర్చుకున్నాను" అని మోడీ అన్నారు.

ఏపీకి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని ప్రధాని తెలిపారు. రేణిగుంట–నాయుడిపేట హైవే, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, బ్రిడ్జ్‌లు, అండర్ పాస్‌లు, అన్నీ రాష్ట్ర అభివృద్ధికి శ్రేణిగా మారుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. నదుల  అనుసంధానంతో సాగు నీటి సమస్యలు లేకుండా చేయాలనే దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు.