Pawan Kalyan: వృద్ధురాలి కాళ్లకు మొక్కి, కలిసి భోజనం చేసిన పవన్.. ఎందుకంటే

Synopsis
పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వృద్ధురాలి ప్రేమకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. స్వయంగా భోజనం వడ్డించి, చీర, డబ్బులను అందించాడు ఏపీ డిప్యూటీ సీఎం. ఇంతకీ పవన్ ఈ పని చేయడం వెనకాల అసలు కారణంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యూ.కొత్తపల్లి మండలంలోని కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి పేరంటాలు, పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని వేగులమ్మ అమ్మవారిని కోరుకున్నారు. తనకు వచ్చే పింఛన్ సొమ్మును జమచేసి రూ.27,000 విలువైన గరగను తయారు చేయించి అమ్మవారికి సమర్పించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెను శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. ఆమె నిస్వార్థ ప్రేమకు ఫిదా అయిన పవన్ కళ్యాణ్, పేరంటాలతో చాలా సేపు మాట్లాడారు. ఆమెకు స్వయంగా భోజనం వడ్డించి, ఆమెతో కలిసి భోజనం చేశారు.
అనంతరం చీరను బహుమతిగా అందించడమే కాకుండా, తన పింఛన్ సొమ్ముతో మొక్కులు తీర్చిన విషయంలో స్పందిస్తూ ఆర్థికంగా కూడా సహాయం చేశారు. కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమెను ఎంతో ఆదరాభిమానాలతో స్వాగతించిన పవన్ కళ్యాణ్ గారు, తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసిన వాహనానికి స్వయంగా వచ్చి వీడ్కోలు పలికారు.