దేశంలో ప‌లు ప్ర‌దేశాల్లో భారీ పేలుళ్ల‌కు జ‌రిగిన ప్ర‌య‌త్నాన్ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (NIA) భ‌గ్నం చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఈ కుట్ర‌కు సంబంధించిన విచార‌ణ‌ను వేగవంతం చేసింది. తాజాగా ఈ కేసుతో విజ‌య‌న‌గ‌రం జిల్లాకు సంబంధం ఉన్న‌ట్లు తేలింది. 

దేశంలో సున్నిత ప్రాంతాల్లో పేలుళ్లు జరిపేందుకు ప్లాన్‌ చేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ సందర్భంగా సోమవారం (మే 20) ఎన్ఐఏ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం చేరుకున్నారు.

వీరికి లభించిన సమాచారం ప్రకారం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పేలుళ్లు జరిపేందుకు పక్కా ప్లాన్ చేశారు. ఈ కుట్రకు నాయకత్వం వహించిన వ్యక్తి సమీర్. ఇతను ‘అల్-హింద్ ఇత్తెహాదుల్ ముసల్మాన్’ అనే పేరుతో ఆరుగురితో కూడిన ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో విజయనగరంకు చెందిన సిరాజ్-ఉర్-రహ్మాన్ కూడా ఉన్నాడు.

ఎవ‌రీ సిరాజ్‌.?

సిరాజ్‌ విజయనగరంలో జన్మించి, 2017లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతని తండ్రి విజయనగరం రూరల్ స్టేషన్‌లో ASI, సోదరుడు SDF పోలీసు కానిస్టేబుల్‌గా ప‌ని చేస్తున్నాడు. ఇంజినీరింగ్ తర్వాత SI సెలెక్షన్ కోసం రెండు సార్లు పరీక్షలు రాశాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. అలాగే గ్రూప్-2 పరీక్షల్లో కూడా విజయం సాధించలేకపోయాడు. 2024 సెప్టెంబర్-అక్టోబర్‌లో 108 సర్వీసుల్లో టెలికాలర్‌గా పని చేశాడు.

హైదరాబాద్‌లో ఉన్న సమయంలో బోయిగుడాకు చెందిన సమీర్‌తో సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వరంగల్‌కు చెందిన పరహాన్ మోయినుద్దిన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బదర్‌తో కూడా ప‌రిచ‌యం పెంచుకున్నాడు. వీళ్లంతా క‌లిసి దేశంలో ప‌లు చోట్ల పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నారు.

2024 నవంబర్ 22న సమీర్, సిరాజ్ కలిసి ముంబై వెళ్లి అక్కడ 10 మందితో సమావేశమయ్యారు. 2025 జనవరి 26న సమీర్ ఢిల్లీకి వెళ్లి షాబాజ్, జీవన్లను కలవాలని ప్రయత్నించాడు. షాబాజ్ విదేశాలకు వెళ్లినట్లు తెలుసుకుని, తర్వాత రోజు మండూళిలోని సల్మాన్ ఖాన్‌ను కలిశాడు.

సమీర్, సిరాజ్, బీహార్‌కు చెందిన అబూ ముసాబ్ (ప్రస్తుతం సౌదీలో ఉన్నాడు) అంద‌రూ సిగ్నల్ యాప్‌లో చాటింగ్ ద్వారా సంప్రదిస్తూ, తక్కువ ఖర్చుతో పేలుడు పదార్థాలు తయారుచేసి జనసంచార ప్రాంతాల్లో పేల్చాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చించారు.

వీరి క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టిన పోలీసులు చివరకు సమీర్, సిరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి టాబ్, అల్యూమినియం పౌడర్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్, పీవీసీ గమ్ వంటి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి మీద భారత న్యాయ సంప్రదాయ కొత్త సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.