భాగ్యనగరంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు ఘనంగా స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో కొన్ని ప్రఖ్యాత ప్రాంతాల్లో పర్యటించిన మిస్ వరల్డ్ భామలు.. తాజాగా పోటీలకు రెడీ అయ్యారు. 

ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ 2025 పోటీకి హైదరాబాద్‌ వేదికవుతున్న నేపథ్యంలో, మే 21న ఈ పోటీకి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటైన హెడ్ టు హెడ్ చాలెంజ్ (Head to Head Challenge) ఘనంగా జరిగింది. ఈ రౌండ్‌లో పోటీదారులు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడంతో పాటు, తాము చేపట్టిన సామాజిక సేవా ప్రాజెక్టులను వివరిస్తూ, తమ ప్రేరణను ప్రపంచ ప్రేక్షకుల ముందు ఉంచారు.

ఈ విడతను అమెరికాస్/కారిబియన్ మరియు ఆఫ్రికా, యూరోప్/ఏషియా & ఓషేనియా అనే రెండు విభాగాలుగా నిర్వహించారు. హోండూరాస్, జమైకా, నికరాగ్వా వంటి దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ అభిప్రాయాలను వివరించారు.

"బ్యూటీ విత్ ఎ పర్పస్" అనే నినాదంతో కొనసాగుతున్న ఈ పోటీ ప్రధానంగా మహిళల సాధికారతను, సామాజిక అభివృద్ధికి అందించే సేవలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోటీదారులు ఇచ్చిన ప్రసంగాలలో, వారు నిర్వహించిన సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను, సామాజిక మార్పు సాధించే దిశగా తమ కృషిని వివరించారు. ఈ విడతలో ప్రభావవంతమైన నేరేటివ్ ఇచ్చినవారే తదుపరి దశలోకి ప్రవేశిస్తారు అని నిర్వాహకులు వెల్లడించారు.

ఈ పోటీ మే 10న హైదరాబాద్‌లో ప్రారంభమై మే 31 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని సంకల్పించింది. ఈ లక్ష్యంతో పోటీదారులను రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలకు పర్యటనకు తీసుకెళ్లారు.

మే 13న చార్మినార్‌లో హెరిటేజ్ వాక్, మే 14న ములుగు జిల్లా రామప్ప ఆలయ సందర్శన, మే 15న యాదగిరిగుట్ట శ్రీ నరసింహ స్వామి ఆలయంలో ప్రార్థనలు, మే 16న మహబూబ్‌నగర్ జిల్లాలో 700 ఏళ్ల పాత మర్రిచెట్టును సందర్శించడం లాంటి కార్యక్రమాలలో మిస్ వరల్డ్ 2025 పోటీదారులు పాల్గొన్నారు.ఈ పర్యటనలో పాల్గొన్న దేశ విదేశాల సుందరీమణులు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి పాజిటివ్ ప్రచారం కలిగించారు.