రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ది చేస్తూ... వైజాగ్ని ఆర్థిక రాజధాని చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ సంస్థలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఇటీవల లులూ మాల్ ఏర్పాటుకు స్థలం కేటాయించామన్నారు. దీంతోపాటు టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో స్థలాన్ని కూడా మంజూరు చేశారు. ఇందుకోసం 21 ఎకరాలను కేటాయించారు. గతంలో ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్ను వైజాగ్లో ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో మరో అంతర్జాతీయ సంస్థ వైజాగ్కు రానున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
అమరావతిలో స్టార్టప్ కంపెనీల ఏర్పాటు కోసం వి- లాంచ్ పాడ్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్కి త్వరలోనే గూగుల్ సంస్థ వస్తున్నట్లు చెప్పారు. గూగుల్ సంస్థ విశాఖపట్నానికి వస్తే.. ఏపీ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారుతుందన్నారు.
హైదరాబాద్లోని హైటెక్ సిటీని 14 నెలల్లోనే పూర్తి చేశామని, అప్పట్లో ఐటీని ప్రోత్సహించగా.. ఇప్పుడు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం కలెక్టర్ కొలువు కంటే.. సాప్ట్వేర్ కొలువుకు డిమాండ్ ఉందని అన్నారు.
ఇక వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ కోసం అధికారులు స్థలాన్ని సిద్దం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో 250 ఎకరాలు స్థలాన్ని గుర్తించామని, అక్కడ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే గూగుల్ గ్లోబల్ నెట్వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కోలే వైజాగ్కి వచ్చి భూములను పరిశీలించారని, డేటా సెంటర్కు సుమారుగా 80 ఎకరాలు అవసరం కాగా.. దాన్ని తర్లువాడ వద్ద ఇస్తున్నట్లు తెలిపారు. ఇక డేటా సెంటర్ ఏర్పాటుకు స్పీడ్ ఇంటర్నెట్ అవసరమని అందుకోసం ఆ కేబుల్ను సముద్ర మార్గం నుంచి తీసుకొచ్చే ప్రణాళికలో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు.