గుంటూరు జిల్లాలో మరో కీచకసంఘటన: ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
దాచేపల్లి ఘటనను మరిచిపోక ముందే గుంటూరు జిల్లాలో మరో కీచక సంఘటన చోటు చేసుకుంది.
గుంటూరు: దాచేపల్లి ఘటనను మరిచిపోక ముందే గుంటూరు జిల్లాలో మరో కీచక సంఘటన చోటు చేసుకుంది. ఆడబిడ్డకు రక్షణగా కదులుదామంటూ తెలుగుదేశం ప్రభుత్వం చైతన్య ర్యాలీలు నిర్వహించిన రోజే తాజా సంఘటన వెలుగులోకి వ్చచింది.
గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల నాగుల్ మీరా అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారికి అతను బావ వరుస అవుతాడు.
ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చాక్లెట్లు కొనిస్తా రమ్మంటూ బాలికను తీసుకుని వెళ్లి నీచానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు పరిస్థితి చూసి ఆందోళనకు గురై ఆస్పత్రికి తీసుకని వెళ్లారు.
చిన్నారిపై అఘాయిత్యం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి చెప్పిన వివరాలను బట్టి పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల చిన్నారిపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన సంఘనట తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు సుబ్బయ్య చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.