ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఇతర కీలక నాయకులు చెబుతున్నారు. ఆయా పనులను ప్రధాని మోదీ మే 2న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు అమరావతి కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఎక్కడివి? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? లేక రాష్ట్ర ప్రభుత్వానివా? పెద్దఎత్తున అప్పులు తీసుకురావడం వల్ల ప్రజలపై అప్పుల భారం పడనుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. వెంటనే ఈ ఫుల్ స్టోరీ చదివేయండి..
అమరావతి పునఃనిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ మే 2న వస్తున్నారు. ఈ సందర్భంగా భారీ బహరంగ సభకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పక్కాగా ఏర్పాట్లు చేసింది. ప్రధాని చేతుల మీదుగా.. సుమారు రూ.41వేల కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమెదం లభించి టెండర్లు పూర్తిగా కావడంతో ముందుగా ఆయా పనులకు శంకుస్తాపన కార్యక్రమం చేపట్టనున్నారు. అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసిన పైలాన్ను మోదీ ఆవిష్కరించనున్నారు. వీటితోపాటు ప్రతిపాదిత పనులు మరో రూ. 60వేల కోట్ల వరకు ఉన్నాయని మంత్రి నారాయణ ఇటీవల తెలిపారు.
ఏపీలో ఒకవైపు లోటు బడ్జెట్, మరోవైపు అప్పుల భారం అధికంగా ఉన్న నేపథ్యంలో వివిధ రూపాల్లో అప్పులు, కేంద్ర ప్రభుత్వ సాయంతో రాజధానిలో పనులను చేపట్టనున్నారు. ఇక ప్రపంచ బ్యాంకు, ఏసియా డెవలప్మెంట్ బ్యాంకు చెరో రూ. 6,700 కోట్లు చొప్పున రూ.13,400 కోట్లు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించాయట. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు రూ. 5వేల కోట్లు ఇస్తోందని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఆయా బ్యాంకులు ఇచ్చిన డబ్బు కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కలుపుకొని గత నెల అనగా.. ఏప్రిల్ 1 నాటికి రూ.4,285 కోట్లు అందినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హడ్కో నుంచి రూ.11వేల కోట్లు అప్పుగా ఏపీ పొందింది. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతోపాటు మిగిలిన నిధులను భూములను తనఖా పెట్టడం, విక్రయించడం, లీజుకు ఇవ్వడం వల్ల ఇతర నగదు సమకూర్చుకుంటారని మంత్రి నారాయణ అంటున్నారు.
కేంద్రం నుంచి సాయం ఇలా..
అమరావతి నిర్మాణానికి ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరాన్ని గుర్తించి, మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. దీని కింద రూ.15 వేల కోట్లు సమకూరుస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే.. ఇవి అప్పు కింద లేదా గ్రాంటా అన్నది స్పష్టం చేయలేదు. రాజధాని ప్రాంతంలో ఏ పని ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ఖర్చులో పది శాతం వరకు గరిష్ఠంగా రూ.1500 కోట్ల వరకు ప్రత్యేక గ్రాంట్లు కింద కేంద్రం ఇస్తోందని కూటమి నేతలు చెబుతున్నారు.
ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం ఏపీ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన సాయాన్ని కేంద్రం అందించాలనే నిబంధన ఉంది. దీనిలో భాగంగా వివిధ గ్రాంట్ల రూపంలో రాజధాని ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి రూ.2,500 కోట్లను ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది. ఇక అమరావతి కోసం చేసే అప్పులు ఏపీ తీసుకునే రెగ్యులర్ రుణ పరిమితి (సీలింగ్) కిందకు రావని కేంద్రం చెప్పింది.
అప్పుల భారం ప్రజలపై పడుతుందా?
ఏపీ రాజధాని అభివృద్ది కోసం చేస్తున్న అప్పుల భారం ప్రజలపై పడుతుందని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే.. అలాంటిది ఏమీ ఉండదని, ప్రజలపై ఒక్క రూపాయి కూడా అప్పుల భారం పడదని మంత్రి నారాయణ చెబుతున్నారు. గతంలో ల్యాండ్ పూలింగ్లో సేకరించిన భూమిలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చేశారని, సీఆర్డీఏ కింద ఇంకా 4 వేల ఎకరాల భూమి ఉందని, భవిష్యత్తులో వాటిని వేలం వసి వచ్చిన డబ్బుతో అప్పులను తీరుస్తామని అంటున్నారు.