పరోపకారార్ధమిదం

By telugu news teamFirst Published Apr 6, 2020, 12:20 PM IST
Highlights

నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకిత భావంతో చేసే కృషి, అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం, పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మన సనాతన సంప్రదాయాలు మనకు నేర్పినది ఏమిటి? మనిషైపుట్టిన వానికి సహనం, శాంతం అవసరమని మన పూర్వీకులు నేర్పించారు. జీవితంలో ఆధ్యాత్మిక లక్షణాలను నేర్చుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. చాలామంది ఎన్నో ముఖ్యమైన  విషయంలలో ‘అది నాకు సంబంధించింది కాదు’ అని కొట్టిపారేస్తుంటారు. మనిషి తన జీవన విధానాన్ని పరిశీలిస్తే ప్రతిరోజూ తమ ప్రమేయం లేకుండానే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలిసో, తెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. ఇందులో గమ్మత్తేమిటంటే తను అనుసరిస్తున్నది ఆధ్యాత్మిక సంబంధమైనదని భావించకపోవడం.

సహనం అంటే ఏమిటి:- నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకిత భావంతో చేసే కృషి, అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం, పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే శిఖరాలను అధిరోహించాలంటే సహనం తప్పనిసరి. ప్రపంచ మనుగడే సహనంతో ముడివడి ఉంది.

మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం అన్నింటినీ ఈ పుడమి భరిస్తూనే ఉంటుంది. అందుకేనేమో తత్వవేత్తలు సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. ఎంత ప్రతిభ ఉన్నను ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలన్నా, అవకాశాలను చేజిక్కించుకోవాలన్నా సహనం అవసరం.

సహనం లోపించడంవల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర పురాణాలే  మనకు సాక్ష్యాలు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలు కావడం, గొప్ప నియంతలు మట్టిలో కలవడం లాంటివి ఎన్నో జరిగాయి. అసహనంతో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాసస్థలం. శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ నిజమైన యోగి లక్ష్యం స్థితప్రజ్ఞత అని అంటాడు.

కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. మానసిక సమతుల్యతతో దాన్ని స్వీకరిస్తూ ఇష్టాయిష్టాలను పక్కనపెడితే విజ్ఞతతో ఒక కొత్త స్థాయిని చేరుకోవచ్చు. ఈ వేదన వలన భగవంతుడి తేజస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది. సహనం మానసిక స్వచ్ఛతకు దారిచూపి భగవదానుగ్రహానికి చేరువ చేస్తుంది. మనిషికి విలువైనదేదీ తొందరగా దక్కదు. లక్ష్యసాధనలో ఆటుపోట్లు తప్పవు.

కష్ట, నష్టాలను భరించగలిగే సహనాన్నిబట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ప్రపంచంలో జీవిస్తున్న మనిషి ద్వంద్వ వైఖరి లేకుండా  చిత్త శుద్ధి ఎంతో అవసరం. స్పృహతో జీవించడమెలాగో నేర్చుకోవాలి. నాణానికి బొమ్మ, బొరుసూ అంటు ఉంటాయి. మనిషి అన్ని తనకు అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజమే కానీ, ఎదో అదృశ్యశక్తి అనేది పరిస్థితుల్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనిషి యొక్క మంచి ఆలోచనలు సహనంతో ముడిపడి ఉంటాయి, ఆ విధిని అనుకూలంగా మార్చుకోవడంలో తోడ్పడతాయి.

ఎంతో నష్టానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామానికి సహనంలేని దుర్యోధనుడే కారకుడు అని ఉదాహరణగా చూసుకోవచ్చును. అసహనంవల్లే అశోకుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన కళింగ యుద్ధానికి కారకుడయ్యాడు.
మత సహనం లేనందువల్లే ఎన్నో వికృతమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. విచిత్రమేమిటంటే అన్నిమతాలు సహనాన్నే బోధిస్తాయి. వాటిని చదవడం, వినడంతో సరిపోదు హితభోదలు చేసే గ్రంధాల మర్మం కనుగొన్న వాడే సహనాన్ని అర్ధం చేసుకోగలడు. 

మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవబలంతోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి. ఈ విషయంలో మనిషి తప్పు కాని మతం కాదు, కులంకాదు ప్రధానం గుణం ప్రధానం. సహనం ఉన్న వానికే తానేమిటి, తన కుటుంబం, ఊరు, దేశం గురించి ఆలోచ విచక్షణలు కలుగుతాయి. గుణహీనుడు అన్ని అవయవాలు ఉన్న అవిటివాడు,గుడ్డివాడితో సమానం. విజ్ఞత ,విచక్షణ కలిగిన వాడు తనతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకుంటాడు. ఈ ప్రకృతి ధర్మం పరోపకారార్ధమిదం అనే  తత్వాన్ని భోదిస్తుంది, మనిషి కుడా ధర్మో రక్షిత రక్షిత: అనే సిద్దానికి కట్టుబడి జీవించాలి. 


 

click me!