శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ల కూడదా? ఎందుకో తెలుసా?

By Naga Surya Phani KumarFirst Published Aug 24, 2024, 12:58 PM IST
Highlights

ఆలయంలో దైవ దర్శనానికి వెళ్లినప్పుడు సాధారణంగా కొబ్బరికాయ, అరటిపళ్లు వంటి వాటిని తీసుకెళతాం. అర్చకులు వాటిని స్వామి వారికి, అమ్మవారికి నైవేద్యం పెట్టి తిరిగి ప్రసాదంగా ఇస్తారు. అయితే శివాలయంలో మాత్రమే పరమశివుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంటికి  తీసుకెళ్లకూడదని ప్రచారంలో ఉంది. అది నిజమా.. కాదా.. ఆ కారణాలు ఏమిటో తెలుసుకుందాం రండి..
 

హిందూ ఆచారంలో ఏముంది..
పూర్వం శివాలయాలు అంటే ఊరికి చివరన, శ్మశానానికి దగ్గరగానూ ఉండేవి. అంటే శివుడు లయకారుడు(సృష్టిని అంతం చేసేవాడు) కనుక ఆ విషయం ప్రజలకు తెలియజేయాలన్న కోణంలో అప్పట్లో రాజులు, పీఠాధిపతులు, ఇలా ఊరి చివర శివాలయాలు నిర్మించేవారు. జీవితం అంతిమకాలంలో ఆ పరమేశ్వరుడిని మోక్షం ప్రసాదించమని కోరడమే శివాలయాలకు భక్తులు వచ్చి చేయాలి. ఈ తత్వం అర్థమవ్వాలనే శివుడికి సమర్పించిన ఏ వస్తువు తిరిగి రాదు.. తీసుకోకూడదని చెబుతారు. 

పురాణ కథల్లో ఏముంది..
కైలాసంలో శివుడు.. నంది, భృంగి, చండీ, తదితర అనుచరగణంతో కలిసి నివసిస్తూ లోకాలను పాలిస్తుంటాడని భక్తులు నమ్ముతారు. శివ పురాణంలోని ఓ కథలో శివుడి నందీశ్వరుడి సేవలకు మెచ్చి వరం కోరుకోమని అడుగుతాడట. అప్పడు నంది మిమ్మల్ని ఎప్పుడూ నేను చూస్తూ ఉండేలా వరం ఇవ్వమని కోరతాడట. శివుడు అంగీకరిస్తాడట. అందుకే శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. నంది కూడా ఓ కన్నుతో శివుడిని చూస్తున్నట్లే ఉంటుంది. అయితే ఇంత గొప్ప వరం పొందిన నందీశ్వరుడిని కాదని శివ ప్రసాదాన్ని తీసుకెళ్లకూడదని భక్తులు నమ్ముతారు. అందుకే అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని నందీశ్వరుడి విగ్రహం దగ్గర పెట్టి వెళ్లిపోతారు. 

Latest Videos

సైన్స్‌ ఏం చెబుతోంది.
సాధారణంగా శివాలయాలు ప్రతి ఊరిలోనూ ఊరి చివరన, శ్మశాలకు దగ్గరలోనూ ఉంటాయి. అంటే శివాలయాల చుట్టూ శ్మశాన వాటిక నుంచి వచ్చే గాలి తిరుగుతూ ఉంటుంది. ఆ గాలిలో బ్యాక్టీరియా, వైరస్‌లు ఎక్కువగా ఉంటాయట. అందువల్ల శివాలయాల్లో ఇచ్చిన ప్రసాదం ఇంటికి తీసుకెళ్లేలోపు దారిలో సూక్ష్మ క్రిములు ఆ ప్రసాదంపై చేరతాయంటారు. అందువల్ల ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా ఆలయంలోనే నందీశ్వరుడు, చండీశ్వరుడి దగ్గర పెట్టి నమస్కారం చేసి వెళ్లిపోతుంటారు.

ఏది మంచిది..
ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం హిందూ ధర్మంలో చాలా అవసరం. పూర్వం పెద్దలు ఏది చెప్పినా ఆరోగ్యం, దైవికం రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఆచారాలు, సంప్రదాయాలు సృష్టించేవారు. వాటి వెనుక విషయం తెలియకపోయినా ఆచారాలు పాటించడం వల్ల మంచి జరిగినా జరగకపోయిన నష్టమైతే జరగదు.  అందువల్ల మీ ప్రాంతాల్లో ఎలాంటి ఆచారాలు పాటిస్తున్నారో తెలుసుకొని వాటిని కొనసాగించడం మంచిది. 
 

click me!