టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేటి తో క్వాలిఫయింగ్ రౌండ్ ముగియనున్నది. రేపటి నుంచి అసలైన టీ20 మజా.. సూపర్-12 దశ ఆరంభం కానున్నది. గ్రూప్- బిలో ఇప్పటికే బంగ్లాదేశ్, స్కాట్లాండ్ సూపర్-12 కు అర్హత సాధించగా.. గ్రూప్- ఎ లో శ్రీలంక ఒక బెర్తును కన్ఫర్మ్ చేసుకుంది. రెండో జట్టేదో నేడు తేలనున్నది.
ఈ మెగా ఈవెంట్ లో భారత్.. 24న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతున్నది. కాగా, ఈ టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరేట్ అని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ అన్నాడు.
టీ20 ప్రపంచకప్ సూపర్-12 ఆరంభానికి ముందు బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టోర్నీలో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసేది భారతీయులే అని బ్రెట్ లీ అన్నాడు.
ఐసీసీకి రాసిన ఓ కాలమ్ లో బ్రెట్ లీ స్పందిస్తూ.. భారత్ కు అగ్రశ్రేణి బ్యాటింగ్ లైనప్, బలమైన పేస్ బౌలింగ్ దళం ఉండటం వారికి కలిసొచ్చే అంశం. ఈ ప్రపంచకప్ లో వాళ్లు కచ్చితంగా ఫేవరేట్ గా ఉంటారు.
ఇక ఈ టోర్నీలో భారత ఓపెనర్ కెఎల్ రాహుల్.. అత్యధిక పరుగులు సాధించే వ్యక్తిగా నిలుస్తాడని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. కొద్దికాలంగా రాహుల్ తన ఆటతో అలరిస్తున్నాడని పేర్కొన్నాడు.
అత్యధిక వికెట్లు తీసే వారే జాబితాలో భారత పేసర్ మహ్మద్ షమీ ఉంటాడని బ్రెట్ లీ జోస్యం చెప్పాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడుతుండటం గమనార్హం.
ఇక యూఏఈ పిచ్ ల మీద ఆడటం ఉపఖండపు దేశాలకు ఎంతో ప్రయోజనకరమని బ్రెట్ లీ రాసుకొచ్చాడు. ‘ఈ వికెట్ల (యూఏఈ) మీద విజయం సాధించిన జట్లు ఉపఖండం నుంచి వచ్చినవి కావున సాధారణంగానే వారికి ఇక్కడ ప్రయోజనం ఉంటుంది. ఆ జట్లతో పాటు ఆసీస్, ప్రొటీస్ (దక్షిణాఫ్రికా) జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో ఆడటం వారికి లాభించేదే’ అని పేర్కొన్నాడు.