Smart City: స్మార్ట్ సిటీ మిష‌న్‌తో దేశంలో వ‌చ్చిన మార్పులు ఏంటి.? SBI రీసెర్చ్‌లో ఆస‌క్తిక‌ర వివ‌రాలు

దేశంలో న‌గ‌రాల‌ను అభివృద్ధి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం స్మార్ట్ సిటీస్ పేరుతో ప‌థ‌కాన్ని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టి 10 ఏళ్లు పూర్తి అవుతోన్న త‌రుణంలో దీంతో దేశంలో ఎలాంటి మార్పులు వ‌చ్చాయ‌న్న దానిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రీసెర్చ్ నివేదికలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ప్రధాని నరేంద్ర మోదీ 2015లో ప్రారంభించిన ఈ మిషన్ ద్వారా ₹1.64 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేప‌ట్టారు. వీటిలో 8,000కిపైగా ప్రాజెక్టులలో 90 శాతానికి పైగా ఇప్పటికే పూర్తయ్యాయి.  ఇప్పటి వరకు 7,500కి పైగా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇందు కోసం కేంద్రం రూ. 1.5 లక్షల కోట్లు ఖ‌ర్చు చేసింది. మొబిలిటీ, నీరు-మురుగునీటి ప్రాజెక్టులకే దాదాపు 50% ఖర్చు చేసింది. 

ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రలో  మొత్తం నిధుల్లో మూడింట ఒక వంతు కేటాయించారు. ఎక్కువ నిధులు వినియోగించిన నగరాల్లో క్రైమ్ రేటు 27% తగ్గింది. స్మార్ట్ సిటీలలో వాయు కాలుష్యం 23% తగ్గిందని ఎస్‌బీఐ నివేదిక‌లో వెల్ల‌డైంది. ఈ మిషన్ వ‌ల్ల‌ నగరాల్లో భద్రత, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి మార్గం సుగుమ‌మైంది. 2020-2022 మధ్యలో, ఎక్కువ ప్రాజెక్టులు అమలైన రాష్ట్రాల్లో ప్రతి లక్ష మందిలో 117 క్రైమ్ కేసులు తగ్గాయి. అదే సమయంలో, మొక్కలు, సీసీ కెమెరాలు, స్వచ్ఛమైన రవాణా వంటివాటితో వాతావరణ నాణ్యత 23% మెరుగైంది.


స్మార్ట్ సిటీ ప‌థ‌కంలో భాగంగా రాయ్‌పూర్‌లో 342 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ. 3759 కోట్ల ఖ‌ర్చుతో ఇండోర్ అగ్ర‌స్థానంలో ఉంది. వెల్లోర్, పుణెలో ఒక్కో ప్రాజెక్టుకి రూ. 60 కోట్లు మించింది. ఇంకా 83,000కి పైగా సీసీ కెమెరాలు, 52 లక్షల ఎల్ఈడి లైట్లు, 4,700 కి.మీ స్మార్ట్ రోడ్లు, 712 కి.మీ సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మించారు.

దాదాపు 49,300 నివాస యూనిట్లు కూడా నిర్మించారు. 5 సంవత్సరాల్లో కేంద్రం రూ. 48,000 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్రాలు, మున్సిపల్‌లు అదే స్థాయిలో నిధులు సమకూర్చాయి. అయితే పీపీపీ మోడల్ ప్రాజెక్టులు కేవలం 6% మాత్రమే ఉండటం నిరాశ కలిగించింది. దీని లక్ష్యం 21%గా ఉంది. 

అమెరికా, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్ లాంటి దేశాలు భారత్‌లోని కొన్ని నగరాల్లో స్మార్ట్ ప్రాజెక్టులకు సహకారం అందించాయి. ఉదాహరణకు, ఫ్రాన్స్ $1.5 బిలియన్‌ను చండీగఢ్, లక్నో, పుదుచ్చేరి ప్రాజెక్టుల కోసం ప్రకటించింది. నిధులు సమకూర్చడమే ఇప్పటికీ పెద్ద సమస్యగా మారింది. కొన్ని నగరాలు (ఇందోర్, భోపాల్) ల్యాండ్ మోనిటైజేషన్, గ్రీన్ బాండ్లు వంటి మార్గాల ద్వారా రూ. 300 కోట్లు రాబట్టాయి. కానీ, ఇంకా చాలా మున్సిపాలిటీల్లో ఇవి వినియోగంలో లేవు.

2030 నాటికి భారత్ జనాభాలో 40% నగరాల్లోనే నివసించనుంది, ఇది జీడీపీకి 75% వాటా ఇచ్చే అవకాశముంది. అందుకే, టెక్నాలజీ ఆధారిత పాలన, ప్రైవేట్ పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ సిటీ మిష‌న్‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 1.64 లక్షల కోట్ల ప్రాజెక్టులు, భద్రత, జీవన ప్రమాణాలు, వాతావరణ పరిరక్షణలో మెరుగుదలతో న‌గ‌రాలు ముందుకు సాగుతున్నాయి. 

Latest Videos

vuukle one pixel image
click me!