గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రికత్త వాతావరణానికి ఫుల్ స్టాప్ పడింది. భారత్, పాకిస్థాన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్మీ అధికారులు ప్రకటించారు.
భారత్ – పాకిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషక్ దర్ వెల్లడించారు. ఆ మేరకు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. తక్షణ కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా చర్చలు జరిగాయని ఎక్స్ లో వెల్లడించారు.
భారత్ పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సైతం స్పందించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు… “పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈ మధ్యాహ్నం 3:35 గంటలకు భారత DGMO కి ఫోన్ చేశారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం 17..00 గంటల నుండి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారినికి సంబంధించి ఇండియన్ ఆర్మీ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. భారత దేశ ఐక్యతను, రక్షణకు విఘాతం కలిగిస్తే ఏమాత్రం ఊరుకునేది లేదని ఆర్మీ అధికారులు తెలిపారు. పాకిస్థాన్ అబద్ధపు ప్రచారాలు చేసిందని అధికారులు తెలిపారు. S-400, బ్రహ్మోస్ మిస్సైల్ లాంటివన్నీ సేఫ్గా ఉన్నాయని కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు. ఇవన్నీ ధ్వంసం అయ్యాయని పాకిస్తాన్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తోంది. సరిహద్దుల్లోని అన్ని ఎయిర్పోర్టులు సురక్షితంగా ఉన్నాయి.
ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్కి గట్టిగానే బదులిచ్చింది. నాలుగు ఎయిర్ఫోర్స్ స్టేషన్లపై దాడి చేసింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్, రాడార్ సిస్టమ్స్ని ధ్వంసం చేశామని అధికారులు చెప్పారు. ఎల్ఓసీ దగ్గర పాక్ డిఫెన్స్ సిస్టమ్స్కి గట్టి దెబ్బ తగిలింది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.
పాకిస్తాన్లోని ప్రార్థనా స్థలాలపై ఇండియా దాడి చేసిందనేది అబద్ధం. ఇండియా లౌకిక దేశం. ఇండియా టెర్రరిస్ట్ క్యాంప్స్పైనే దాడి చేసింది. సరిహద్దులను కాపాడటానికి సిద్ధంగా ఉన్నామని, అప్రమత్తంగా ఉంటామని ఆర్మీ చెప్పింది. అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవించే దేశం ఇండియా. ప్రార్థనా స్థలాలపై దాడి చేశామనే ప్రచారాన్ని ఖండిస్తున్నామని అధికారులు సంయుక్త ప్రెస్ మీట్లో చెప్పారు.