India Pakistan War : పోఖ్రాన్పై పాకిస్తాన్ డ్రోన్ దాడిని భారత వాయుసేన భగ్నం చేసింది. రాజస్థాన్ సరిహద్దుల్లో రెడ్ అలర్ట్తో పాటు రాత్రివేళ బ్లాక్ఔట్ అమలు చేస్తున్నారు.
India Pakistan War: జమ్మూ కశ్మీర్లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ వుండగా, ఈ ఆరోపణలను పాక్ తిరస్కరించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ కయ్యానికి కాలు దువ్వుతూ భారత్ పై దాడులకు పాల్పడుతోంది.
ఈ ఉద్రిక్తతల మధ్య, పాకిస్తాన్ గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భారతదేశంలోని 26 ప్రదేశాల్లోని సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులకు యత్నించింది. కానీ భారత వాయుసేన ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది.
ఇటీవలి దాడుల్లో, శుక్రవారం రాత్రి పోఖ్రాన్ వద్ద పాకిస్తాన్ డ్రోన్ ప్రయోగానికి యత్నించింది. భారీ శబ్దాలు వినిపించడమే కాకుండా ఆకాశంలో వెలుగులు కనిపించాయి. కానీ భారత వాయుసేన ఈ డ్రోన్లను తక్షణమే గుర్తించి గాల్లోనే పాక్ డ్రోన్లను ధ్వంసం చేసింది. ఈ ఘటనతో రాజస్థాన్లోని జైసల్మేర్, బార్మేర్, శ్రీగంగానగర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు ప్రజలను ఇండ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
జైసల్మేర్ జిల్లాలోని కిషన్ఘాట్ గ్రామంలో శుక్రవారం ఉదయం లైవ్ బాంబ్ బయటపడింది. దీనితో ప్రజల్లో భయం నెలకొనగా, ఆర్మీ వెంటనే ప్రాంతాన్ని సీల్ చేసి బాంబ్ డిస్పోజల్ పనులు చేపట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రాకపోకలు, తక్కువ ఎత్తులో విమానాల దూసుకెళ్లడం వంటి దృశ్యాలు ప్రజల భయాందోళనను పెంచుతున్నాయి.
జిల్లా కలెక్టర్ కొత్త ఆంక్షలను అమల్లోకి తెచ్చారు. మే 8 నుంచి జూలై 7 వరకు డ్రోన్ వినియోగంపై నిషేధం విధించారు. డ్రోన్ యజమానులు తమ పరికరాలను పోలీస్ స్టేషన్లలో అప్పగించాల్సిందిగా సూచించారు. టపాసుల అమ్మకం, కొనుగోలు, వినియోగం పూర్తిగా నిషేధించారు. ప్రతి రోజు రాత్రి 9 నుండి ఉదయం 6 వరకు బ్లాక్ఔట్ అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత వాహనాల రాకపోకలు నిషేధించారు. రామ్గఢ్-టానాట్ రోడ్డును మధ్యాహ్నం 3 తర్వాత మూసివేయనున్నారు.
రైల్వేలు పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేయగా, జైపూర్-జైసల్మేర్, బార్మేర్-మునాబావో, భగత్ కీ కోఠీ-మునాబావో రైళ్ల సేవలు తాత్కాలికంగా నిలిపివేశాయి. మొత్తం నాలుగు రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. ఐదు రైళ్లు తిరిగి షెడ్యూల్ చేశారు.
ఇప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారి, ప్రేమ్చంద్ బయర్వా తదితరులు పాల్గొనగా, వరుసగా రెండో రోజు న్యాయ-ఆర్డర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత సైనిక వ్యవస్థలు పలు డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకోవడంతో ప్రాణనష్టం లేదా తీవ్రమైన నష్టం తప్పింది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత పటిష్ఠం చేయడానికి రాజస్థాన్ ప్రభుత్వం తొమ్మిది సబ్ డివిజనల్ అధికారులను సరిహద్దు ప్రాంతాల్లో నూతన నియామకాలు చేసింది.