Indian Soldier Returns to Border Days After Wedding: మహారాష్ట్ర పాచోరాకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్ పెళ్లైన మూడు రోజులకే దేశ రక్షణ కోసం బోర్డర్కు తిరిగి వెళ్లారు. భార్య యామిని కన్నీటి పర్యంతమవుతూ 'దేశ రక్షణ కోసం తన సింధూరాన్ని పంపుతున్నానంటూ' ఎమోషనల్ అయ్యారు.
Indian Soldier Returns to Border Days After Wedding: పెళ్లి మనిషి జీవితంలో ఒక కీలకమైన ఘట్టం. పెళ్ళి తర్వాత సంతోషమైన జీవితాన్ని గడపాలని అందరూ కలలు కంటారు. భారత సైన్యంలో పనిచేస్తున్న మనోజ్ పాటిల్ కూడా అలాంటి కలలే కన్నాడు. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని పాచోరాకు చెందిన మనోజ్కు ఇటీవలే పెళ్ళి జరిగింది. ఇదే సమయంలో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
దీంతో అతని సెలవు రద్దు కావడంతో వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు వచ్చాయి. మనోజ్ పాటిల్, యామినిల వివాహం మే 5న జరిగింది. మే 8న దేశ సేవ కోసం వెంటనే హాజరు కావాలని ఆయనకు పిలుపు వచ్చింది. దేశ సేవ చేయాలనే తపనతో మనోజ్ తన విధుల్లో చేరడానికి బయలుదేరాడు. మే 5న వివాహం జరిగిన తర్వాత కేవలం మూడు రోజుల్లోనే మనోజ్ తిరిగి వెళ్ళిపోయాడు.
ఈ సందర్భంగా జవాన్ మనోజ్ భార్య యామిని భావోద్వేగంతో మాట్లాడుతూ "నా కుంకుమను ఆపరేషన్ సింధూర్ కోసం పంపిస్తున్నాను. దేశం కంటే గొప్పదే లేదు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దేశ సేవ పట్ల ఆమె గౌరవం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పాచోరా పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో మనోజ్ పాటిల్ ఇల్లు ఉంది. అక్కడి నుంచే ఆయన బయలుదేరారు. గ్రామ పెద్దల తరపున మనోజ్ పాటిల్ను సత్కరించారు. మన సైనికుడు ఒక్కడు కాదు, పది మంది పాకిస్తానీలను మట్టుబెట్టి విజయం సాధిస్తాడని ఈ సందర్భంగా వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
రిటైర్డ్ పోలీస్ అధికారి విజయ్సింగ్ పాటిల్ కూడా మనోజ్ను సత్కరించారు. పాచోరా రైల్వే స్టేషన్లో దేశ సరిహద్దుకు వెళ్తున్న మనోజ్ పాటిల్ను చూసి తల్లిదండ్రులు, భార్య, సోదరుడు సహా ఇతరులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ, దేశ రక్షణ కోసం అతను వెళ్తుండటం గర్వంగా ఉందని తెలిపారు.
కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేలడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుందనే చర్చ జరుగుతుండగానే, మే 6, 7 తేదీల్లో రాత్రి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను నిర్వహించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
అయితే, పాకిస్తాన్ తన వక్రబుద్దిని చూపిస్తూ భారత సామాన్య పౌరులపై డ్రోన్లతో దాడులు, కాల్పుడు జరపడం మొదలుపెట్టగా, భారత్ ధీటుగా తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే జవాన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల సెలవులను రద్దు చేశారు. మహారాష్ట్రలోని పాచోరాలో పెళ్ళి సెలవుపై వచ్చిన జవాన్ మనోజ్ పాటిల్ పెళ్ళి సంబరాలు ఇంకా పూర్తి కాకుండానే నేరుగా సరిహద్దుకు బయలుదేరాడు. జవాన్ మనోజ్ పాటిల్ దేశ సేవ కోసం చూపిన అంకితభావం, ఆయన భార్య యామిని వెలిబుచ్చిన జాతీయత భావం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.