తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ అవార్డుల విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. తను హీరోగా నటించిన శ్రీమంతుడు, మహర్షి సినిమాలతో పాటు తాను నిర్మించిన మేజర్ సినిమాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డులు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా లో ఓ పోస్ట్ పెట్టారు.

శ్రీమంతుడు, మహర్షి, మేజర్ వంటి సినిమాలకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని అందించిన తెలంగాణ ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాల విజయానికి కారకులైన నా దర్శకులకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అని అన్నారు.

ఈ వ్యాఖ్యలతో పాటు, మహేశ్ బాబు తన సినిమాల వెనుక ఉన్న సాంకేతిక బృందం, దర్శకుల కృషిని గుర్తు చేశారు. ఆయన నటించిన ఈ మూడు సినిమాలు విజయం సాధించడమే కాకుండా ప్రత్యేకంగా నిలిచాయి. తెలంగాణ ప్రభుత్వం సినీ రంగాన్ని గౌరవించేందుకు తీసుకున్న ఈ అవార్డుల విషయంలో సెలబ్రిటీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, బాలయ్య, మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఈ విషయంలో స్పందించారు.

సమాజాసేవకుడు, ఉద్యమకారుడు, ప్రజాగాయకుడు గద్దర్ పేరు మీద ఈ అవార్డులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. గద్దర్ అవార్డ్ తో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డ్, బీఎన్ రెడ్డి, కాంతారావు, పైడి జయరాజ్ పేర్లతో కూడా అవార్డ్ లను ప్రభుత్వం ప్రకటించింది. నూతన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో మరికొన్ని సత్కారాలను ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.