వీల్ ఛైర్తోనైనా ప్రచారం చేస్తా : ఆసుపత్రి బెడ్పై నుంచి మమత సందేశం
రెండు, మూడు రోజుల్లో మళ్లీ ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వీల్ చైర్ సాయంతో అయినా ప్రచారం నిర్వహిస్తానన్నారు. తన ఛాతీ, తలపై గాయాలయ్యాయని మమత చెప్పారు.
రెండు, మూడు రోజుల్లో మళ్లీ ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వీల్ చైర్ సాయంతో అయినా ప్రచారం నిర్వహిస్తానన్నారు. తన ఛాతీ, తలపై గాయాలయ్యాయని మమత చెప్పారు.
సీఎం హాస్పిటల్ బెడ్పై వున్న వీడియోను టీఎంసీ విడుదల చేసింది. కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని మమతా బెనర్జీ ఆ వీడియోలో చెప్పారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ తన మేనిఫెస్టో ఆవిష్కరణను వాయిదా వేసుకుంది. గురువారం మహా శివరాత్రిని పురస్కరించుకుని పార్టీ మేనిఫెస్టోను సీఎం మమతా బెనర్జీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు.
అయితే సీఎం మమతపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని టీఎంసీ వాయిదా వేసుకుంది. మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని.. మమతా బెనర్జీ కోలుకున్న తర్వాత రిలీజ్ చేస్తామని పార్టీ ప్రకటించింది.
తమ మేనిఫెస్టో రెడీగానే ఉందని.. ఆమె లేకుండా విడుదల చేసే ప్రసక్తే లేదని తృణమూల్ నేత ఒకరు వెల్లడించారు. కాగా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిన్న నందిగ్రామ్లో దాడి జరిగిన సంగతి తెలిసిందే.
ఆమె కాలికి గాయం కావడంతో కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని నిశ్చయించిన మమత.. బుధవారం నామినేషన్ వేశారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సుబ్రత బక్షితో కలిసి 2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తూ హల్దియా సబ్డివిజనల్ ఆఫీసుకు చేరుకుని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు దీదీ.
అనంతరం రియాపాడలోని ఓ శివాలయంలో పూజలు చేశారు. సాయంత్రం 6.15 గంటల సమయంలో కోల్కతాకు తిరిగి వెళ్తున్న సమయంలో తనపై నలుగురైదుగురు వ్యక్తులు దాడి చేసినట్టు మమతా బెనర్జీ తెలిపారు. ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి.