బెంగాల్ ఎన్నికలు: నందిగ్రామ్లో సువేందు అధికారి కాన్వాయ్పై రాళ్ల దాడి
పశ్చిమ్ బెంగాల్లో రెండో విడత పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది
పశ్చిమ్ బెంగాల్లో రెండో విడత పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది.
అయితే, ఆ దాడి నుంచి సువేందు సురక్షితంగా బయటపడ్డారు. నందిగ్రామ్లోని సాతేన్గాబరీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ రాళ్ల దాడిలో సువేందు కారును అనుసరిస్తున్న మీడియా వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.
మరోవైపు పశ్చిమ మిడ్నాపూర్లోని కేశ్పూర్ భాజపా అభ్యర్థి ప్రీతి రంజన్ కాన్వాయ్పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రెండో దశలో భాగంగా బెంగాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
సువేందు అధికారి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్ కూడా ఆ స్థానాల్లో ఒకటి. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 58 శాతం పోలింగ్ నమోదైనట్లుగా సమాచారం. ఈ సందర్భంగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నందిగ్రామ్లోని బేకుటియా ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త ఉదయ్ దూబే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయ్ దూబే.. సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి రోడ్ షో కు హాజరైన తర్వాత టీఎంసీ నుంచి బెదిరింపులు రావడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. ఇతని ఆత్మహత్యకు టీఎంసీనే కారణమని కాషాయ నేతలు ఆరోపిస్తున్నారు.