ఒకప్పుడు కమ్యూనిష్టుల కోటను బద్దలుకొట్టిన మమత బెనర్జీ మూడో సారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కుంచుకొనే దిశగా సాగుతోంది. 

కోల్‌కత్తా: ఒకప్పుడు కమ్యూనిష్టుల కోటను బద్దలుకొట్టిన మమత బెనర్జీ మూడో సారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కుంచుకొనే దిశగా సాగుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 1977 జూన్ 21న జ్యోతిబసు సీఎంగా ఎన్నికయ్యారు. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1977 నుండి 2011 మే వరకు సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. 1977జూన్ 21నుండి 2001 నవంబర్ ఐదు వరకు జ్యోతిబసు సీఎంగా కొనసాగారు. వయోభారం వల్ల ఈ బాధ్యతలనుండి ఆయనను పార్టీ తప్పించింది. దీంతో 2000 నవంబర్ 6న బెంగాల్ సీఎంగా బుద్దదేవ్ భట్టాచార్య బాధ్యతలు చేపట్టారు. 2006 మే 17 వరకు ఆయన సీఎంగా కొనసాగారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బుద్దదేవ్ భట్టాచార్య సీఎంగా ఉన్న సమయంలో తీసుకొన్న భూసేకరణ విధానాలపై అప్పటి విపక్షనేత మమత బెనర్జీ పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. ఈ ఉద్యమం బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం గద్దె దిగడానికి కారణంగా మారింది. 2011లో తొలిసారిగా బెంగాల్ లో టీఎంసీ ప్రభుత్వం ఏర్పాటైంది. 2011 మే 20న మమత బెనర్జీ తొలిసారిగా సీఎం గా బాధ్యతలు చేపట్టారు. 2016 లో జరిగిన ఎన్నికల్లో కూడ మమత బెనర్జీ రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకొన్నారు. 2021 ఎన్నికల్లో కూడ టీఎంసీ మూడోసారి అధికారం వైపునకు దూసుకుపోతోంది. 

ఈ దఫా ఎన్నికల్లో మమతను అధికారానికి దూరం చేసేందుకు బీజేపీ సర్వశక్తులను ఒడ్డింది. కానీ బీజేపీ గతంలో కంటే సీట్లను పెంచుకొంది. కానీ అధికారానికి దూరంగా ఆ పార్టీ నిలిచింది.ఒకప్పుడు బెంగాల్ ను పాలించిన కమ్యూనిష్టులు ఈ రాష్ట్రంలో తమ ఉనికిని కాపాడుకొనేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.