బెంగాల్ ఎన్నికలు: సువేందు అధికారి సోదరుడి కారుపై దాడి
తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేత, నందిగ్రామ్ అభ్యర్ధి సువేందు అధికారి సోదరుడు సౌమేందు అధికారి కారుపై దాడి జరిగింది
తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేత, నందిగ్రామ్ అభ్యర్ధి సువేందు అధికారి సోదరుడు సౌమేందు అధికారి కారుపై దాడి జరిగింది.
ఈ దాడి సమయంలో సౌమేందు అధికారి ఆ కారులో లేరు. అయితే కారు డ్రైవర్ మాత్రం గాయాలపాలయ్యాడు. దుండగుల దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఇది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పనేనని బీజేపీ ఆరోపించింది.
మరోవైపు ఈ దాడిపై సౌమేందు అధికారి స్పందించారు. తృణమూల్ బ్లాక్ నేత గోవింద్ దాస్, ఆయన భార్య రిగ్గింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అడ్డుకోవడానికి వచ్చిన కారణంగానే తనపై దాడి చేశారని ఈ దాడిలో తన కారు ధ్వంసమైందని, డ్రైవర్కు గాయాలయ్యాయని సౌమేందు పేర్కొన్నారు.
కాగా, తొలి దశ ఎన్నికల ప్రారంభానికి ఒక్క రోజు ముందు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. తొలి దశ ఎన్నికల్లో భాగంగా 38 స్థానాలకు రేపు (శనివారం) ఎన్నికలు జరగనుండగా, అందులో ఒకటైన బంకురా జిల్లాలోని జోయ్పూర్లో ఈ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి పనేనని టీఎంసీ ఆరోపించింది. అయితే, బీజేపీ మాత్రం ఇది టీఎంసీ పనేనని మండిపడింది.