టిడిపి సభ్యుల్లో కొందరు మాత్రమే ఏపి వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించారని... మిగతా సభ్యులంతా ఈ  బిల్లుకు మద్దతు  తెలిపారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.  

విశాఖపట్నం: వికేంద్రీకరణ, సీఆర్డిఏ రద్దు బిల్లులపై ఏపి శాసనమండలి తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనటానికి తీవ్ర సంకేతమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలు చోటుచేసుకున్న రోజును బ్లాక్ డే గా పేర్కొన్నారు. చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తే చట్టం ఒప్పుకోకపోయినా తన విచక్షణాధికారం ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటాననడం ఈ సమావేశాల్లోనే చూశామన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవటానికా ఎగువ సభ ఉన్నది అంటూ నిలదీశారు. చంద్రబాబు స్వయంగా శాసనమండలిలో చైర్మన్ ఎదుట కూర్చుని కనుసైగలతో శాసించారని... అక్రమంగా నిర్ణయం తీసుకునేలా ఛైర్మన్ ను ప్రేరేపించారని ఆరోపించారు. అయితే ఇంతచేయడం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటో అర్థంకావడం లేదని... కేవలం రెండు, మూడు నెలల జాప్యం జరగవచ్చని అన్నారు. దీనికి విజయోత్సవాలు చేయించుకోవటం టిడిపి నాయకులకే చెల్లిందన్నారు. 

రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడి ఆనందించటం అయిదుకోట్ల ప్రజల ఆశలను అవహేళన చేయటమేనని అన్నారు. సభలో కొందరు తెలుగుదేశం సభ్యులతో సహా అందరు ఎమ్మెల్సీలూ రూలు ప్రకారం బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపరాదని... ఓటింగ్ జరపాలనీ గట్టిగా కోరారని తెలిపారు. అయినా ఛైర్మన్ షరీఫ్, చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. 

read more రాజధానికి కొత్త నిర్వచనం... హార్స్ లీ హిల్స్, అరకు నుండి జగన్..: సోమిరెడ్డి సెటైర్లు

శాసనమండలి అవసరమే లేదని... ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఇదిమనుగడలో ఉందని అన్నారు. మండలి కొనసాగాలా... వద్దా అన్నదానిపై సోమవారం జరగనున్న చర్చను తాము స్వాగతిస్తున్నామన్నారు. 

చంద్రబాబు శాసనమండలిలో ఏఏ పెద్దలను కూర్చోపెట్టారో చెప్పాలని అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు. కొడుకు లోకేష్, కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్దా వెంకన్న, వరుస ఓటముల యనమల... వీరంతా చంద్రబాబు పెద్దలసభలో కూర్చోబెట్టిన పెద్దమనుషులు అంటూ ఎద్దేవా చేశారు. వీళ్లంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. 

మూడు గ్రామాల్లోని తమ భూములకోసం పదమూడు జిల్లాల ప్రయోజనాలు దెబ్బతీస్తారా అని నిలదీశారు. మేధావులు, ప్రజాస్వామ్య వాదులూ టిడిపి వైఖరిని ఖండిస్తున్నా వారికి ఇంకా సిగ్గురావడం లేదన్నారు. 

విశాఖలో కార్యాలయాలన్నీ ప్రభుత్వ భూములు, భవనాల్లోనే ఉన్నాయని తెలిపారు. పోర్టు, స్టీలు ప్లాంటు, నేవీ, పోలవరం వంటి జాతీయ సంస్థలకు విశాఖవాసులు లక్షల ఎకరాలు ఇచ్చారన్నారు‌. వారికి ఇన్నేళ్లకు ఒక అవకాశం రాగా తండ్రీ కొడుకులు దాన్ని అడ్డుకున్నారంటూ చంద్రబాబు, లోకేష్ లను విమర్శించారు. ఇది తాత్కాలిక జాప్యమే... విశాఖకు రాజధాని రాక తప్పదని అమర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

read more మండలి పరిణామాలు... కులాల మధ్య చిచ్చుకు చంద్రబాబు యత్నం: డిప్యూటీ సీఎం

యనమల రామకృష్ణుడు ఆనాడు ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. ఆనాటినుంచీ ఆయన చట్ట వ్యతిరేక వైఖరి కొనసాగుతూనే ఉందన్నారు. అన్నింటిని తట్టుకుని విశాఖకు రాజధానిని సాధించుకుంటామని అమర్‌నాథ్ రెడ్డి అన్నారు.