ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన డిల్లీ పర్యటన వివరాలను బయటపెట్టాలని టిడిపి నాయకులు దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఇది ముఖ్యమంత్రి అధికారిక పర్యటన కాబట్టి ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చించిన విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం వుందన్నారు. 

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఆయన నోటినుంచి ఒక్కమాట కూడా రాలేదని... ప్రధాని, ఇతర మంత్రులకు ఇచ్చిన విజ్ఞాపనలను పబ్లిక్‌డొమైన్‌లో పెట్టకపోవడం విడ్డూరంగా ఉందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రమంత్రులకు విడివిడిగా వినతిపత్రాలిచ్చిన ముఖ్యమంత్రి వాటిలోని వివరాలను వెల్లడించడానికి ఎందుకు సంకోచిస్తున్నాడన్నారు. కనీసం మీడియాముందుకు కూడా రాలేని నిస్సహాయస్థితిలో సీఎం ఎందుకున్నాడో చెప్పాలన్నారు. 

మంత్రి బొత్స ఒక ప్రముఖ పత్రికాసంస్థ అధినేతకు లేఖ రాశారని... దానిలో తాను అనని మాటలను అన్నట్లుగా రాసినట్లు ఆయన ఆరోపించారని దేవినేని తెలిపారు. అదేవార్తను టైమ్స్‌ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రభ పత్రికలు కూడా ప్రచురించాయని బొత్స వాటికి ఎందుకు నోటీసులివ్వలేదని దేవినేని ప్రశ్నించారు. 

వైసీపీ ప్రభుత్వం ఎన్డీఏలో చేరుతున్నట్లు మంత్రే ప్రకటించారంటూ, అందుకు సంబంధించిన వీడియోను టీడీపీనేత విలేకరుల ఎదుట ప్రదర్శించారు. జగన్‌ ఒత్తిడివల్లే బొత్స 1974, ఆగస్ట్‌10న ప్రారంభమైన ప్రముఖ తెలుగు దినపత్రిక వ్యవస్థాపకుడికి నోటీసు ఇచ్చాడని... ఆయనవైఖరి చూస్తుంటే సీఎం, సాక్షిమీడియా ఎంతలా భయపడుతున్నాయో అర్థమవుతోందన్నారు. 

read more జగన్ పెద్ద నీతిమండేమీ కాదని బొత్స ఆనాడే అన్నాడు... సాక్ష్యమిదే...: వర్ల రామయ్య

చంద్రబాబు, సదరుపత్రికా యజమాని వయస్సుని గురించి హేళనగా మాట్లాడుతున్న మంత్రులంతా ఒక్కసారి వారి బతుకులేమిటో, ఎక్కడినుంచి వచ్చారో ఆలోచిస్తే బాగుంటుందన్నారు. 2018-19లో దేశంలోనే పెట్టుబడులు ఆకర్షణలో ఏపీ మూడోస్థానంలో నిలిచి, రూ. 70వేలకోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిందని, వైసీపీవచ్చాక రూ.లక్షా80 వేలకోట్ల పెట్టుబడులు రాష్ట్రంనుంచి వెనక్కువెళ్లాయని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే చెప్పిందన్నారు. ఈ అంశాన్ని వదిలేసిన రాష్ట్ర ఆర్థికమంత్రి పదేపదేపాతపాటే పాడుతూ పాచిపళ్ల దాసుడిగా తయారయ్యాడన్నారు. 

కియా వెళ్లిపోవడం గురించి, కియా అనుబంధ పరిశ్రమలు తరలిపోవడం గురించి, విశాఖలో ఉండాల్సిన సంస్థలు వెనక్కువెళ్లడం గురించి మాట్లాడలేని బుగ్గన, అసెంబ్లీలో చెప్పిన రాజధాని భూముల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కి సంబంధించిన తప్పుల ప్రసంగాన్నే నేడుకూడా చదివి వినిపించాడన్నారు. అమరావతి పై విషం చిమ్మడం తప్ప బుగ్గనకు రాష్ట్రంలోని ఇతర సమస్యలు పట్టడంలేదన్నారు. 

రాజధానిలోని అమృతమయ విశ్వవిద్యాలయంతో పాటు ఇతర విశ్వవిద్యాలయాలు మూసేసి, విజ్ఞాన్‌ సంస్థలకు లాభంచేకూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జన్సీ వస్తున్నా కూడా బుగ్గన తన బురదజల్లే ప్రయత్నాలు మానుకోవడంలేదన్నారు.

read more వైసిపి గెలుపుకు బిజెపియే కారణం... ఎన్డీఏలో చేరికపై ఏమైనా జరగొచ్చు..: ఎంపీ టిజి

వ్యవసాయ, ఇరిగేషన్‌, సివిల్‌ సప్లైస్‌ మంత్రులంతా బాధ్యతలేకుండా, వారి శాఖలపై అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని, ధాన్యం, మిర్చి, సుబాబుల్‌ రైతులు గిట్టుబాటు ధరలేక రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. గుంటూరు మిర్చియార్డులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు రైతులను దోచుకుంటుంటే, ఆయనేమో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నాడన్నారని దేవినేని ఉమ ఆరోపించారు.