ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలను తప్పుబట్టారు. ముఖ్యంగా విద్యావ్యవస్థ సంస్కరణ పేరుతో ఇతర శాఖలను నిర్వీర్యం చేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

అమరావతి: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయించి నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారామని చెప్తున్న ప్రతినిధులకు ఈ తీర్పు ఒక పాఠం కానుందన్నారు. భవిష్యత్తులో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలపై వుందన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక రాష్ట్ర విద్యావ్యవస్థలో జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతల్లో అవి అమలవ్వడం లేదని ఎద్దేవా చేశారు. 

అమ్మఒడి పథకానికి రూ.6400 కోట్లు కేటాయించడం బాగానే వున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేకపోడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నిధులను కూడా వివిధ సంక్షేమ శాఖల నుండి మళ్లించారని అన్నారు. ఇలా నిధులు మళ్లించిన శాఖల పరిస్థితి రానురాను దయనీయంగా మారి భవిష్యత్ లో ఆ శాఖలు నిర్వీర్యమయ్యే ప్రమాదం వుందన్నారు. 

read more మూడు రాజధానులపై మండలిలో చర్చ... బిజెపి స్టాండ్ ఇదే: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

నాడు-నేడు పధకంపై స్పందిస్తూ గతంలో స్కూల్ గ్రాంట్స్ రూపంలో విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులు విడుదల చేసేవారని... ఈ ప్రభుత్వం వచ్చాక నేటి వరకు ఒక్క రూపాయి కూడా గ్రాంట్లు విడుదల చేయలేదన్నారు. 

ఇక వసతి దీవెన, విద్యా దీవెన అని మరో పధకాన్ని తీసుకువచ్చారని... అయితే ఇంతవరకు రూ.2390 కోట్లు బకాయిపడ్డ ప్రభుత్వం వీటికోసం నిధులు ఎక్కడినుండి తెస్తుందన్నారు. పాత బకాయిలు విడుదల చేయమని అడిగితే విద్యార్ధులపై లాఠీ చార్జీ చేయించారని ఆరోపించారు. విద్య ,వసతి దీవెనలు దేవుడెరుగు ముందు బకాయిలు చెల్లించాలని సూచించారు. 

జగనన్న గోరు ముద్ద అని పెట్టిన పధకం సొమ్ము ఒకడిది ,సోకొకడిది అన్నట్టుగా ఉందన్నారు. ఆ పధకం కేంద్ర ప్రభుత్వ పధకమని... మద్యాహ్న బోజన పథకం కోసం 60 శాతం కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు. దీనికి జగనన్న గోరు ముద్ద అని పేరు పెట్టుకోవడం విడ్డూరంగా వుందన్నారు. విద్యార్థులకు ప్రస్తుతం భోజన సదుపాయం కల్పించే కార్మికులకు మూడు నెలలుగా జీతల్లేవని... దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వారికి వేతనాలు ఇవ్వకుంటే పిల్లలకు పౌష్టికాహారం ఎలా పెడతారని ప్రశ్నించారు. 

read more పవన్ కల్యాణ్ జాగ్రత్త...అలాగే చేస్తే రాష్ట్రంలో తిరగలేవు: మంత్రి వార్నింగ్

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం అంటే అమ్మను చంపి ఆయాను ముందుకు తీసుకువస్తున్నట్టుగా వుందన్నారు. అమ్మఒడి బదులు మమ్మీ ఒడి అని పెట్టుకోండని సైటైర్లు విసిరారు. ఆంగ్లం అవసరమే కానీ తెలుగు మాద్యమాన్ని కూడా కొనసాగించాలన్నారు. అమ్మ పేరు పథకాలకు పెట్టుకునే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదని తులసిరెడ్డి విమర్శించారు.