అల్లుడిని ముందు పెట్టి వెనకుండి కేసీఆర్: డీకె అరుణ
తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసుల తీరు హేయమైన చర్య అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసుల తీరు హేయమైన చర్య అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నిరసన దీక్షలో ఉన్న బండి సంజయ్ను ఆమె పరామర్శించి సిద్దిపేట ఘనటకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడారు. అధికార దాహంతో బిజెపి నేతలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో బిజెపి గెలుపు ఖాయం అయిన నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
తెరాసకు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారన్నారు. దుబ్బాకలో తెరాసను ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అల్లుడిని ముందు పెట్టి సీఎం కేసీఆర్ వెనకుండి నడిపిస్తున్నారని విమర్శించారు. హరీశ్ రావు కేంద్రంపై ఆరోపణలు చేయడం తప్ప రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. అబద్దాలు చెప్పే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు డాక్టరేట్లు ఇవ్వొచ్చని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బాబు మోహన్, పెద్ది రెడ్డి ,డి కె అరుణ పాల్గొన్నారు.
ఇదిలావుంటే, బండి సంజయ్ దీక్షకు మద్దతుగా బిజెపి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బండి సంజయ్ ఫోన్ లో తనపై జరిగిన దాడి గురించి మాట్లాడారు.