తిరుమల పవిత్రతను, ఆగమ శాస్త్రం విలువలను మంటగలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్య ఆరోపించారు.    

తిరుపతి: ప్రపంచ దేశాలలోనే అగ్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ కోట్లాది హిందువుల మనోభావాలకు స్ఫూర్తిగా నిలిచే అత్యంత ప్రతిష్టాత్మక ఆలయమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం వుందని బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్య అన్నారు. దేవాలయ పవిత్రతను కాపాడినప్పుడే కోట్లాది భక్తుల మనోభావాలను కూడా కాపాడినట్లు అవుతుందన్నారు. ఆ భాద్యత పూర్తిగా రాష్ట్రం ప్రభుత్వం, టిటిడిపైనే వుందన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే తిరుమల పవిత్రతను, ఆగమ శాస్త్రం విలువలను మంటగలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తిరుమల ఏడు కొండలు కాదు రెండు కొండలేనని జీవో తెచ్చిన తండ్రి వైఎస్సార్‌ మాదిరిగానే జగన్ కూడా వ్యవహరిస్తున్నారని... హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పవిత్ర పుణ్యక్షేత్రం విషయంలో ఇలా ప్రవర్తించడం తగదన్నారు. 

తిరుమల బస్‌టికెట్లపై అన్యమత ప్రచారం మొదలు టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసుక్రీస్తు బోధనల పుస్తకాలు అప్‌లోడ్‌ చేయడం, టీటీడీలో అన్యమతస్తులు విధులు నిర్వర్తించడం, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిధుల తగ్గింపు, పవిత్ర తిరుమల దేవాలయంపై మంత్రుల పరుష పదజాలంతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు.

read more video:రేణిగుంట విమానాశ్రయంలో జనసేనానికి ఘన స్వాగతం

తాజాగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోని పంచాంగ సమాచారంలో 'శ్రీ యేసయ్య' అనే అక్షరాలు వెంకన్న భక్తులను తీవ్రంగా కలిచివేశాయన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని గానీ అన్యమత దైవాన్ని కానీ కలలో కూడా ఊహించుకోలేని భక్తులకు ఇది తీవ్ర మనస్తాపం కలిగిస్తోందని పేర్కొన్నారు. 

పదేపదే తెలుగుదేశం పార్టీపై లేని ఆరోపణలను గుప్పించే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, వైసీపీ నాయకులు మల్లాది విష్ణు దీనికి ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను మంటగలిపిన వారందరూ దేవుని శిక్షకు గురయ్యారని గుర్తుచేశారు. 

read more చంద్రబాబు వాహనంపై దాడి కేసు... సిట్ ఏర్పాటు

వీటన్నింటిని దృష్టిలో వుంచుకుని ఇప్పటికైనా సీఎం జగన్ తన వ్యవహారశైలి మార్చుకుని తిరుమలలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలని సూచించారు. లేదంటే హిందువులందరూ సంఘటితమై పోరాటానికి దిగాల్సి వుస్తుందని... అలా జరిగితే తమరి ప్రభుత్వం కనుమరుగవడం ఖాయమని సీఎం జగన్ కు ఆనందసూర్య హెచ్చరించారు.