చేవెళ్లలోనే షర్మిల పార్టీ ప్రకటన: తెలంగాణ సీఎం అభ్యర్థి ఆమెనే...
వైఎస్ కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని నడపదలుచుకున్నట్లు అర్థమవుతోంది. చేవెళ్లలోనే వైఎస్ షర్మిల తన పార్టీ పేరును ప్రకటించనున్నట్లు రాఘవ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: వైఎస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటును ఆయన కూతురు వైఎస్ షర్మిల వాడుకోబోతున్నారు. తన కొత్త పార్టీని చేవెళ్లలో ప్రకటించనున్నారు. ఐదు లక్షల మంది సమక్షంలో చేవెళ్లలో పార్టీని ప్రకటిస్తామని రాఘవ రెడ్డి చెప్పారు. మంచి రోజు చూసి పార్టీని షర్మిల ప్రకటిస్తారని ఆయన చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే షర్మిలమ్మనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు.
తొలుత పాత పది జిల్లాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు జరుగుతాయని, ఆ తర్వాతనే పార్టీ ప్రకటన ఉంటుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత పులివెందులలోని వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని దర్శించుకుంటామని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి తాము తోకపార్టిగా ఉండదలుచుకోలేదని, కొత్త పార్టీని పెడుతామని ఆయన అన్నారు. అక్కడి పార్టీని ఇక్కడ నడపడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
Also Read: జగన్ ఏపీలో పనిచేస్తున్నాడు, నేను తెలంగాణ కోసం పనిచేస్తా: షర్మిల
పాదయాత్ర చేస్తామని కూడా రాఘవ రెడ్డి చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా నాయకులతో ఆత్మీయ సమావేశం ముగిసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు.
తెలంగాణకు మాత్రమే పరిమితమై రాజకీయాలు చేయాలని, అందుకే పార్టీని స్థాపించాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నారని, తాను తెలంగాణలో పనిచేస్తానని ఆమె అన్నారు. దీన్నిబట్టి షర్మిల వైఎస్ జగన్ తో ఏర్పడిన విభేదాల వల్ల పార్టీ పెట్టడం లేదని అర్థమవుతోంది.