చిన్నారి ఏడవడంతో భర్తతో వాగ్వాదం జరిగి ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో విషాదం నింపింది. చిన్నారి కోసం కట్టిన చీర ఊయలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ : క్షణికావేశంలో ఓ తల్లి దారుణమైన నిర్ణయం తీసుకుంది. పాపకు ఊయలగా వేసిన చీరనే ఉరితాడుగా మార్చుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాదులోని ఉప్పల్ ఏరియాలో ఆదివారం వెలుగు చూసింది. తన తొమ్మిది నెలల చిన్నారిని పడుకోబెట్టడానికి చీరనే ఊయలగా చేసింది ఓ తల్లి. కుటుంబ కలహాల నేపథ్యంలో.. ఆ చీర ఊయలలోంచి చిన్నారిని తీసి.. కింద పడుకోబెట్టి అదే చీరతో.. తాను ఊరికి వేలాడింది. దీనికి సంబంధించి ఉప్పల్ ఎస్సై సుధాకర్ రెడ్డి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..
హైదరాబాదులోని ఉప్పల్ ఏరియాలోని లక్ష్మీ నగర్ కాలనీలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన మనోజ్, పూజిత ఉంటున్నారు. వారిద్దరూ దంపతులు. వీరికి 9 నెలల చిన్నారి ఉంది. మనోజ్ ప్రైవేటు ఉద్యోగి. పూజిత (21) చిన్నారిని చూసుకుంటూ ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో టెలీ మార్కెటింగ్ చేస్తోంది. ఉద్యోగ విధుల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆమె ఫోన్ లో మాట్లాడుతోంది. ఆ సమయంలో చిన్నారి ఏడుపు అందుకుంది.
సికింద్రాబాద్ : పద్మజా హోటల్లో అగ్నిప్రమాదం.. రంగంలోకి అగ్నిమాపక శాఖ
అది చూసిన భర్త, భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు అలాగే వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రోజు లాగే భర్త ఉద్యోగానికి వెళ్లిపోయాడు. భర్తతో వాగ్వాదం తర్వాత గదిలోకి వెళ్లిన పూజిత ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో వాళ్లతో పాటే ఇంట్లో ఉన్న అమ్మమ్మకి అనుమానం వచ్చింది. గదిలోకి వెళ్దామని చూస్తే గడియ వేసి ఉంది. ఎన్నిసార్లు పిలిచిన సమాధానం లేదు. వెంటనే స్థానికుల సహకారంతో తలుపులు పగలగొట్టారు. గదిలో పూజిత ఉరివేసుకుని కనిపించింది.
అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూజితను హుటాహుటిన ఉరినుంచి దింపి.. ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
