Rain Alert: ఇక కాస్కోండి.. బంగాళఖాతంలో అల్పపీడనం, వచ్చే 2 రోజులు భారీ వర్షాలు
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరింత బలపడే అవకాశం
వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. పలు చోట్ల ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వాతావరణం మరింత చురుగ్గా మారనుంది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు సముద్ర కార్యకలాపాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
సోమవారం ఏపీకి వర్ష సూచన
సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మంగళవారం ఉత్తరాంధ్రపై ప్రభావం
మంగళవారం కూడా వాతావరణ వ్యవస్థ ప్రభావం కొనసాగనుంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరం అని హెచ్చరించారు.
తెలంగాణలోనూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
అల్పపీడనం ప్రభావం తెలంగాణపైనా కనిపించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాల నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కిందకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. రైతులు కూడా పొలాల్లో పనిచేసే సమయంలో వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

