గాంధీ భవన్ లో తనకు వ్యతిరేకంగా  పోస్టర్ల వేయించడంలో  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  హస్తం ఉందని  కాంగ్రెస్ నేత మధు యాష్కీ ఆరోపించారు.ఈ ఆరోపణలను  సుధీర్ రెడ్డి  కొట్టి పారేశారు.


హైదరాబాద్:తనపై గాంధీభవన్ లో వేయించిన పోస్టర్ల వెనుక ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేత మధు యాష్కీ ఆరోపించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హైద్రాబాద్ గాంధీ భవన్ లో మధు యాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. గో బ్యాక్ నిజామాబాద్ పేరుతో మధు యాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. సేవ్ ఎల్ బీ నగర్ కాంగ్రెస్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల విషయమై మధు యాష్కీ సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఎల్ బీ నగర్ లో ఓటమి భయంతోనే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తనపై కుట్రలు చేస్తున్నారని మధు యాష్కీ ఆరోపించారు. ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే కోవర్టులు కొందరు ఇక్కడ పనిచేస్తున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా వారి విధానాన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు.సుధీర్ రెడ్డి చాలెంజ్ విసిరిన వారం రోజుల్లోనే కొందరు కోవర్టులు పార్టీ మారారని మధు యాష్కీ గుర్తు చేశారు. 

ఎవరు పోటీ చేసినా నేను సిద్దం: దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి మధు యాష్కీ పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో కొందరిని తాను రెచ్చగట్టినట్టుగా సాగుతున్న ప్రచారాన్ని ఎల్ బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొట్టి పారేశారు.తనపై ఎవరు పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్దమని ఆయన చెప్పారు.

also read:గో బ్యాక్ నిజామాబాద్: మధు యాష్కీకి వ్యతిరేకంగా గాంధీ భవన్ లో పోస్టర్లు

2004,2009 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా మధు యాష్కీ పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మరోసారి అదే స్థానం నుండి పోటీ చేసిన మధు యాష్కీ బీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో అయిష్టంగానే నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి మధు యాష్కీ పోటీ చేశారు. మూడో స్థానానికే ఆయన పరిమితమయ్యారు. గత ఎన్నికల్లోనే ఆయన భువనగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని భావించారు. చివరి నిమిషంలో నిజామాబాద్ నుండి ఆయన బరిలోకి దిగాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.ఈ దఫా మాత్రం నిజామాబాద్ కు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ధరఖాస్తు కూడ చేసుకున్నారు.